భద్రాచలం, డిసెంబర్19 : భద్రాద్రి దివ్యక్షేత్రంలో సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు మంగళవారం ఏడో రోజు కు చేరాయి. దశావతారాల్లో భాగంగా స్వామివారు నిజరూప రాముడిగా దర్శనమివ్వడంతో భక్తులు పరవశించిపోయారు. ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులు, నిత్య కల్యాణమూర్తులకు బేడా మండపంలో అభిషేక తిరుమంజనం జరిపారు. అనంతరం స్వామివారిని అంతరాలయంలోకి తీసుకెళ్లి భక్త రామదాసు.. రామయ్యకు, సీతమ్మ తల్లికి, లక్ష్మణ స్వామివారికి తయారు చేయించిన దివ్యాభరణాలను ధరింపజేశారు. స్వామివారిని రామావతారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారిని బేడా మండపానికి తీసుకొచ్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచన జరిపారు. ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి నేతృత్వంలో ఆచార్య, బ్రహ్మ ఋత్విక్లు నాళాయిర ప్రబంధంలోని 200 పాశురాలను అధ్యయనం చేశారు. తర్వాత స్వామివారిని అంతరాలయంలోనికి తీసుకెళ్లి రాజభోగం నివేదన చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారిని సమస్త మంగళ వాయిద్యాలు, వేద ఘోషలతో, కోలాట నృత్యాల నడుమ మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆశీనులను చేశారు. భక్తులు తమ ఆరాధ్య దైవాన్ని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వామివారిని మిథిలా స్టేడియం నుంచి తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ జరిపారు. రామయ్యకు అరటి పండ్లు, కొబ్బరి కాయలు, హారతులు సమర్పించారు. కాగా.. బుధవారం స్వామివారు బలరామునిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.
పర్ణశాల, డిసెంబర్ 19 : పర్ణశాల ఆలయంలో జరుగుతున్న ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు నిజరూప అవతారంలో పర్ణశాల రామయ్య భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యగ్రహ బాధలు ఉన్న వారు స్వామివారి అవతారాన్ని దర్శించుకున్నట్లయితే విముక్తి పొందుతారని అర్చకులు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారి నిజస్వరూపమైన రామావతారంలో ఉన్న ఉత్సవమూర్తులను వైభవంగా మేళతాళాలతో గ్రామ పురవీధుల్లో తిరువీధి సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు కిరణ్కుమార్ చార్యులు, భరద్వాజ్ చార్యులు, అమరవాది శ్రీకాంత్ చార్యులు, నరసింహా చార్యులు, రాజగోపాలాచార్యులు, ఏఈవో శ్రావణ్కుమార్, అనిల్, సూపరింటెండెంట్ కిశోర్, గుమస్తా ప్రసాద్, సిబ్బంది రాము, శివ పాల్గొన్నారు.