పాల్వంచ, మార్చి 21 : పదో తరగతి పరీక్ష నిర్వహణలో పొరపాటు జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల హెచ్చరించారు. గురువారం పాల్వంచ కేటీపీఎస్ డీఏవీ మోడల్ స్కూల్లోని పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ విద్యార్థులు పరీక్ష రాసే తీరును పరిశీలించారు. హాజరైన విద్యార్థుల వివరాలను చీఫ్ సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఇన్విజిలేటర్లు ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించాలన్నారు. కేంద్రాల్లో మౌలిక వసతులు పూర్తిస్థాయిలో ఉండాలని ఆదేశించారు. ఆమె వెంట ఆర్డీవో మధు, పాల్వంచ తహసీల్దార్ వివేక్, మున్సిపల్ కమిషనర్ స్వామి ఉన్నారు.