అశ్వారావుపేట, ఏప్రిల్ 7: ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు భోజనంతోపాటు గుడ్డు, అరటి పండ్లు ఎందుకు ఇవ్వడంలేదని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ప్రశ్నించారు. మండల కేంద్రంలో మంగళవారం విస్తృతంగా పర్యటించిన ఆయన.. తొలుత ఆసుపత్రిని సందర్శించారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అన్ని రకాల జబ్బులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, కొరత ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు. ఆరోగ్యశ్రీ సేవలు ప్రతి రోగికి అందేలా పటిష్ట చర్యలు చేపట్టాలని వైద్యులకు సూచించారు. అనంతరం మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్.. భోజన నాణ్యతను తనిఖీ చేశారు.
వంట గదిలో నిల్వ ఉంచిన బెల్లం నాణ్యతపై అనుమానం వ్యక్తం చేశారు. కూరగాయలు, పచారీ సామగ్రిని పరిశీలించి.. ప్రతి రోజూ తాజా కూరగాయలతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ప్రిన్సిపాల్ సంగీతకు సూచించారు. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, మెనూ కచ్చితంగా పాటించాలని, భోజనం నాణ్యతలో విద్యార్థులను కూడా భాగస్వాములను చేయాలని ఆదేశించారు. గురుకులంలో మెనూ పాటించడం లేదనే అంశం తన దృష్టికి వచ్చిందని, మరోసారి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల స్థలాన్ని పరిశీలించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ కిశోర్, ఎంపీడీవో అప్పారావు, మున్సిపల్ కమిషనర్ బి.నాగరాజు, ఆర్ఎంవో మౌనిక పాల్గొన్నారు.