ఖమ్మం/సత్తుపల్లి టౌన్/మధిర, ఫిబ్రవరి 15 : రాజ్యసభ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గురువారం నామినేషన్ దాఖలు చేసిన వద్దిరాజు రవిచంద్రకు బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు. రవిచంద్రకు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
రవిచంద్ర తన రెండేళ్ల పదవీ కాలంలో ప్రజా సమస్యలపై తన వాణిని బలంగా వినిపించారని, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడంతోపాటు జిల్లాలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం తనదైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉన్న ఒక్క రాజ్యసభ సీటును బీసీ సామాజిక వర్గానికి ఇచ్చి న్యాయం చేయాలనే ఉద్దేశంతో వద్దిరాజుకు అవకాశం కల్పించి బీసీలపై కేసీఆర్ తన ప్రేమను చాటుకున్నారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.