– కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ
బూర్గంపహాడ్, ఏప్రిల్ 16 : కార్మికుల సమస్యలపై ఐటీసీ యాజమాన్యం దిగొచ్చేంత వరకు రిలే దీక్షలు, పోరాటం ఆగదని జేఏసీ కన్వీనర్ పాటి | సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, ఎస్కే యాకూబ్పాషా, బల్లెం నాగయ్య అన్నారు. గురువారం 22వ రోజుకు దీక్షలు చేరుకోవడంతో దీక్షలో మేకల శేషమ్మ, ఆకిని చందర్రావు, సోయం ముత్తమ్మ, ఈసంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. దీక్షల్లో కార్మికులకు ఐటీసీ ఎంప్లాయిస్ యూనియన్ జేఏసీ సభ్యులు బిట్రా సాయిబాబు, కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ సభ్యులు సింగారపు సతీష్, చుక్కపల్లి బాలాజీ, ఆకిని సర్వేశ్వరరావు పూలమాల వేసి పోరాటానికి మద్దతు పలికారు.
ఈ సందర్భంగా జేఏసీ బాధ్యులు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులు ఎండను సైతం లెక్కచేయకుండా 22 రోజులుగా దీక్ష చేస్తున్నా ఐటీసీ యాజమాన్యానికి కనికరం కలగడం లేదన్నారు. కార్మికుల శ్రమను దోచుకుని లాభాలు సాధిస్తున్న యాజమాన్యం కార్మిక సమస్యలను
పరిష్కరించేంత వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అవసరమైతే సమ్మెకు సైతం వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జేఏసీ నాయకులను చర్చలకు పిలవకుండా యాజమాన్యం కాలయాపన చేస్తుందని, యాజమాన్యం కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. ఈ దీక్షా శిబిరంలో జేఏసీ సభ్యులు కందాల వెంకటరెడ్డి, మర్రి వెంకటరెడ్డి, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, కోడూరు శ్రీనివాసరావు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.