– బూర్గంపహాడ్లో రూ.65 లక్షలతో సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్డు నిర్మాణాలకు భూమి పూజ
– లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
బూర్గంపహాడ్, జూన్ 17 : గ్రామీణ ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారంర బూర్గంపహాడ్ మండలంలో పర్యటించిన ఆయన బూర్గంపహాడ్ మండల కేంద్రంలో రూ.65 లక్షల అంచనాతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్డు పనులకు ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు అభివృద్ధికి పాటుపడుతున్నామన్నారు. గ్రామాల్లో అంతర్గత రహదారుల్లో సీసీ రోడ్లు పూర్తయితే రవాణా సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు.
మండల పరిధిలోని సారపాక వాసవీ ఫంక్షన్హాల్లో తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని 34 మంది లబ్దిదారులకు చెక్కులు అందించడంతో పాటు 25 మందికి రూ.13 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో పీఆర్ డీఈ పొదెం వెంకటేశ్వరరావు, ఏఈ చక్రధరాచారి, సర్పంచులు మందా నాగరాజు, బాదం వెంకటేశ్రెడ్డి, పోతినేని సూరమ్మ, సర్పా నాగమణి, లక్ష్మీపురం మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ జడ్పీటీసీ బట్టా విజయ్ గాంధీ, భజన సతీష్, ప్రసాద్, ఇంగువ రమేష్, వారాల వేణు, పూలపెల్లి సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు