దమ్మపేట రూరల్ : అశ్వారావుపేట-ఖమ్మం జాతీయ రహదారి నెత్తురోడ్డింది. ఆదివారం తెల్లవారుజామున వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. ముష్టిబండ గ్రామ శివారులో తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొని ఒకరు మృతి చెందగా, గంటల వ్యవధిలోనే రెండు కిలోమీటర్ల దూరంలో గాంధీనగర్ గ్రామం వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకు మృతి చెందారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన అరిసపల్లి సరస్వతి (70), ఆమె కుమారుడు కృష్ణ (53) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెంలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా గాంధీనగర్ గ్రామం వద్ద వారి ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, బంధువులకు సమాచారం అందించారు.
అంతకు రెండు గంటల ముందు ముష్టిబండ గ్రామ శివారులో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నాగాలాండ్కు చెందిన లారీ డ్రైవర్ మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.