పాల్వంచ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్దులు, దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లు తగ్గించి పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పాత పాల్వంచలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఈ నెల 31వ తేదీ వరకు పింఛన్ల కు ధరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని వృద్దులకు కల్పించిందని, సంక్షేమ పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేయకుండా సీఎం కేసీఆర్ సారధ్యంలో ముందుకు దూసుకుపోతోందని అన్నారు. ప్రతీ పేద కుటుంబానికి లబ్ది చేకూరాలనే ఉన్నత ఆశయంతో సీఎం ఈ అవకాశం కల్పించారని అన్నారు. ఈ పథకానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికీ వెనుకంజ వేయకుండా దీన్ని మరింత అమలుకు చర్యలు చేపట్టడం ఎంతో హర్షణీయమని ఆయన కొనియాడారు.
ఈ పథకంలో అందరూ అర్హులైన వారికి న్యాయం జరిగేలా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పార్టీ నాయకులు ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామాల్లో అర్హులైన వృద్దులను గుర్తించి ధరఖాస్తు చేసుకునేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్, పెద్దమ్మగుడి కమిటీ సభ్యులు చింతా నాగరాజు, బేతంశెట్టి విజయ్, కనగాల నారాయణ తదితరులు పాల్గొన్నారు.