– ఐటీసీ హెన్ఆర్ హెడ్కు కార్మిక సంఘాల వినతి
బూర్గంపహాడ్, ఆగస్టు 24 : సారపాక అద్దె భవనంలో నడుస్తున్న ఐటీసీ డిస్పెన్షరీ నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపాలని ఐటీసీ పీఎస్ పీడీ వర్కర్స్ యూనియన్ (గుర్తింపు సంఘం)తో పాటు పలు కార్మిక సంఘాల నాయకులు సోమవారం ఐటీసీ పీఎస్ పీడీ హెన్ఆర్ హెడ్ శ్యామ్ కిరణ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వర్కర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఐటీసీ పీఎస్పీడీ భద్రాచలం యూనిట్లో పని చేస్తున్న 5 వేల మంది కాంట్రాక్టు కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సుమారు 20 వేల మంది ఈఎస్ఐ డిస్పెన్షరీలో వైద్య సేవలు పొందుతున్నారన్నారు. ఈఎస్ఐ డిస్పెన్షరీ అద్దె భవనంలో నడుస్తుండగా అద్దె చెల్లింపు జాప్యం కారణంగా భవన యజమాని డిస్పెన్షరీ ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చారని మా దృష్టికి వచ్చిందని, దీనివల్ల వేలాదిమంది కార్మికులు, కుటుంబ సభ్యులు, ఇతర ఈఎస్ఐ లబ్దిదారులు అవసరమైన వైద్యసేవలకు దూరమయ్యే అవకాశం ఉందని… ఈఎస్ఐ డిస్పెన్షరీకి శాశ్వతమైన, అనుకూలమైన, సులభంగా అందుబాటులో ఉండే ప్రాంగణాన్ని కేటాయించడం అవసరమని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
ఐటీసీ పరిధిలోని ఎస్బీఐ బ్యాంకు భవనంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న గదులు డిస్పెన్షరీ నిర్వహణకు అనువైన స్థలంగా ఉంటుందని భావించి 15న కంపెనీలోని అన్ని కార్మిక సంఘాలు ఉమ్మడిగా చర్చించి ప్రతిపాదన తమ ముందుకు తీసుకువచ్చినట్లు తెలిపారు. డిస్పెన్షరీ నిర్వహణను ఎస్బీఐ ఆవరణలో గదులకు కేటాయించేలా సిఫార్సు చేయడంతో పాటు సహకారం అందించాలని కోరారు. ఈఎస్ఐ డిస్పెన్షరీ అద్దెను యాజమాన్యం కొంతకాలం కట్టిందని, ఇది రెండవ ఆప్షన్గా పరిగణించాలన్నారు. మూడవ ఆప్షన్గా ఈస్ట్ పక్కన అవుట్ లెట్ పైపులైనుపై ఉన్న పరిశ్రమకు సంబంధించిన ఖాళీ స్థలాల్లో డిస్పెన్సరీని నిర్మిస్తే బాగుంటుందని ప్రతిపాదన చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో గుర్తింపు సంఘంతో పాటు పలు కార్మిక, క్రాంటాక్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు.