హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రుణాల మంజూరు, పంపిణీలో లంచాలు వసూలు చేశారన్న ఆరోపణలపై ఎస్బీఐ వజీర్బాద్ బ్రాంచ్ మేనేజర్ ఎం ఉదయ్గోపాల్పై హైదరాబాద్ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. నల్లగొండ జిల్లా వజీర్బాద్ బ్రాంచ్లో 2024 నుంచి 2025 మధ్య 109 మంది రుణగ్రహీతలకు మొత్తం రూ.2.10 కోట్ల వ్యవసాయ రుణాలను మంజూరు చేసి, వాటిని పంపిణీ చేసే క్రమంలో లంచాలు తీసుకున్నట్టు ప్రాథమిక సమాచారంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంలో వడపల్లి గ్రామానికి చెందిన రూపావత్ సైదానాయక్ మధ్యవర్తిగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి.
సైదానాయక్ రుణగ్రహీతల నుంచి నగదు రూపంలో లంచాలు వసూలు చేసి, బ్యాంకు మేనేజర్ ఉదయ్గోపాల్తో 70:30 నిష్పత్తిలో పంచుకున్నట్టు ఏసీబీ అధికారులు పేరొన్నారు. సైదానాయక్ యూనియన్ బ్యాంక్లోని తన ఖాతా నుంచి రూ.43,97,927లను ఉదయ్గోపాల్ భార్య కోమలాదేవి హెచ్డీఎఫ్సీ ఖాతాకు బదిలీ చేసినట్టు ఏసీబీ పేరొంది. అలాగే రూ.8,56,930లను ఉదయ్గోపాల్ హెచ్డీఎఫ్సీ ఖాతాకు బదిలీ అయినట్టు ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ రెండు లావాదేవీల మొత్తం రూ.52,54,857గా తేల్చారు. ఎస్బీఐ వజీర్బాద్ బ్రాంచ్లో హౌస్కీపింగ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న షేక్ ఖాదర్ మొయినుద్దీన్, ఇమ్రాన్ షేక్ పత్రాల మార్పిడిలో సహకరించినట్టు ఏసీబీ చెప్పింది.