ఇస్లామాబాద్, సెప్టెంబర్ 17: ఒక వైపు పశ్చిమాసియా సంక్షోభం పట్టిపీడిస్తుండగా, మరోవైపు ఎర్ర సముద్రంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులతో అంతర్జాతీయంగా తీవ్ర చమురు సంక్షోభం ఏర్పడుతున్నది. దీంతో అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్ ఈ సంక్షోభ పరిస్థితుల నుంచి కొంత ఉపశమనం పొందేందుకు పొదుపు తరహా ప్యాకేజీని అమలు చేయడానికి సిద్ధపడింది. ప్రభుత్వ వాహనాల కొనుగోలుపై పూర్తి నిషేధాన్ని విధించింది. ప్రభుత్వ వాహనాలకు ఇంధనం కేటాయింపులో 50 శాతం కోత విధించింది. వివాహ వేడుకల్లో సింగిల్ డిష్ నిబంధనను అమలులోకి తెచ్చింది.
ఇంధన కోతలతో పాటు మూడు నెలల వరకు అధికారులు విదేశీ పర్యటనలు చేయరాదని ఆంక్షలు విధించింది. ఇకపై మంత్రులు, సలహాదారులు, ముఖ్య అధికారులు ఎకానమీ తరగతిలో ప్రయాణించాలి. పొదుపు ఆంక్షలు పౌరులను కూడా ప్రభావితం చేస్తున్నాయి. పెండ్లిండ్లు, ఇతర వేడుకల్లో ఒక్క వంటకం మాత్రమే అతిథులకు వడ్డించాలని ఆదేశాలు జారీ చేసింది. దుకాణాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, బజార్లు, డిపార్ట్మెంటల్, గ్రోసరీ స్టోర్లు రాత్రి తొమ్మిదికల్లా మూసివేయాలి.