సిటీబ్యూరో, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయాన్ని బేగంపేట్లోని చారిత్రక పైఘా ప్యాలెస్కు తరలించే ప్రక్రియ తీవ్ర అనిశ్చితిలో పడింది. అమీర్పేట్లోని స్వర్ణజయంతి కాంప్లెక్స్, నానక్ రామ్ గూడలోని హెచ్ జీసీఎల్, ట్యాంక్ బండ్ వద్ద ఉన్న బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ విభాగాలు వేర్వేరుగా పనిచేస్తుండటంతో, పాలనా సౌలభ్యం కోసం వీటన్నింటిని ఒకే గొడుగు కిందకు తేవాలని గతేడాది ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అప్పటి నుంచి వరుస ఆధునీకరణ, మరమ్మతుల పేరిట కోట్ల రూపాయలను హెచ్ఎండీఏ ఖర్చు చేస్తూ హెచ్ఎండీఏ కార్యాలయంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తూనే ఉంది.
గతంలో అమెరికన్ కాన్సులేట్ కొనసాగిన ఈ ప్యాలెస్ను హెచ్ఎండీఏ అవసరాలకు తగ్గట్టుగా ఆధునీకరించాలని భావించారు. ఆ పనుల్లో జరుగుతున్న ఆలస్యం, వివాదాల కారణంగా తరలింపు మరో ఏడాది పాటు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్యాలెస్ వెనుక భాగంలో కొత్తగా లైట్ వెయిట్ భవనాలు, రెండు కాన్ఫరెన్స్ హాళ్ల నిర్మాణంతో పాటు వందలాది వాహనాలను పార్కింగ్ కోసం రూ. 7.78 కోట్లతో అండర్ గ్రౌండ్ పారింగ్ యార్డ్ నిర్మించేందుకు టెండర్లు పిలిచారు.
అయితే 1890 నాటి ఈ చారిత్రక హెరిటేజ్ సైట్ ప్రాంగణంలో తవ్వకాలు జరపడం, అదనపు నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్యాలెస్కు ముప్పు వాటిల్లుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు హెరిటేజ్ అభ్యంతరాలు, మరోవైపు సున్నపురాయి కట్టడాన్ని దెబ్బతినకుండా పునరుద్ధరించే సవాళ్లతో పనులు మందగించాయి. దీంతో అన్ని విభాగాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి కనీసం మరో ఏడాది సమయం పడుతుందని, అప్పటివరకు అమీర్పేట్ కార్యాలయం నుంచే పాలన కొనసాగక తప్పదని అధికారులు భావిస్తున్నారు.