జూలూరుపాడు, మే 22 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండల తీవ్రత నిప్పుల కొలిమిని తలపిస్తుంది. జూలూరుపాడు మండలంలోని తల్లాడ–కొత్తగూడెం ప్రధాన రహదారిపై వినోబానగర్ గ్రామ సమీపంలో ఉన్న సీతారామ ప్రాజెక్టు వంతెన వద్ద ఓ స్కూటీ శుక్రవారం అగ్నికి ఆహుతైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ పట్టణానికి చెందిన దంపతులు స్కూటీపై ఖమ్మం వెళ్లి తిరుగు ప్రయాణంలో మధ్యాహ్న సమయంలో సీతారామ వంతెన వద్దకు చేరుకోగానే వాహనం నుండి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గుర్తించిన వారు అప్రమత్తమై స్కూటీని రోడ్డు పక్కన వదిలేశారు.
కొద్ది క్షణాల్లోనే మంటలు ఉద్ధృతరూపం దాల్చి స్కూటీ మొత్తం తగలబడిపోయింది. దట్టమైన నల్లటి పొగ, మంటలు వ్యాప్తి చెందడంతో ప్రధాన రహదారిపై కొంతసేపు వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. కాగా ఈ ఘటనకు ఎండల ప్రభావమే కారణమా? లేక వాహనంలో సాంకేతిక లోపమా? అన్నది అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే వాహన యజమానులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వారి పూర్తి వివరాలు, ప్రమాదానికి అసలు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. సంబంధిత అధికారులు విచారణ చేపట్టిన తర్వాతే వాస్తవం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.