రామవరం, జనవరి 10 : కొత్తగూడెం కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించాలని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి కమిషనర్ సుజాతను కోరారు. శనివారం కమిషనర్ను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతినెల 4వ తేదీ లోపు పారిశుధ్య కార్మికులకు గౌరవ వేతనం చెల్లించాల్సి ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు 4వ తేదీ లోపు వేతనాలు చెల్లించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. సంక్రాంతి పండుగ, సమ్మక్క సారక్క జాతర ఉన్న నేపథ్యంలో కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని కోరారు. 10వ తేదీ వచ్చినా పట్టణంలోని పారిశుధ్య కార్మికులకు నేటికీ గౌరవ వేతనం అందలేదని విమర్శించారు. తద్వారా పారిశుధ్య కార్మికులు పనులు మానేయడంతో కొత్తగూడెం కార్పొరేషన్ మురికి కూపంగా మారుతుందని తెలిపారు. కొత్తగూడెం పట్టణంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఆమె పేర్కొన్నారు.