రుద్రంపూర్, జూన్ 17 : సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. రుద్రంపూర్, గౌతంపూర్ పంచాయతీ పరిధిలో పలుచోట్ల చెట్లు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు సింగరేణి ఎలక్ట్రికల్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని ఎర్రగడ్డలో చెట్టు ఓ ఇంటిపై పడటంతో రేకులు దెబ్బతిన్నాయి. ఉదయం నుంచి తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలకు సాయంత్రం కురిసిన వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, ఈదురు గాలుల కారణంగా సాధారణ జనజీవనం కొంతసేపు అస్తవ్యస్తమైంది.