చుంచుపల్లి, జూన్ 19 : రామవరం బ్రిడ్జి నుంచి విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్డు వెంట వెంటనే వీధిలైట్లు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు, వాహనదారులు, వాకర్స్ అధికారులను, ఎమ్మెల్యేను కోరుతున్నారు. రామాలయం నుండి విద్యానగర్ కాలనీ, చుంచుపల్లి తండా, హౌసింగ్ బోర్డ్ ప్రాంతాల మీదుగా ఖమ్మం వైపు వెళ్లే ప్రధాన రహదారికి ఈ బైపాస్ రోడ్డు అనుసంధానంగా ఉండడంతో నిత్యం వందలాది మంది వాహనదారులు ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారిపై పోలీస్ స్టేషన్ కూడా ఉన్నప్పటికీ ఇప్పటివరకు వీధిలైట్లు ఏర్పాటు చేయలేదు. దీంతో తెల్లవారుజామున, సాయంత్రం, రాత్రి వేళల్లో ఈ ప్రాంతం అంధకారంగా మారి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్కు వెళ్లే ప్రజలు కూడా భద్రతా సమస్యలను ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. రహదారిపై సరైన వెలుతురు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బైపాస్ రహదారి అభివృద్ధికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రత్యేక కృషి చేశారని, ఇప్పుడు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీధిలైట్ల ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది, వాహనదారులు, వాకర్స్ అందరికీ ఉపయోగపడేలా ఈ మార్గంలో వీధిలైట్లు ఏర్పాటు చేస్తే భద్రత పెరగడంతో పాటు ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు.