– 30 రోజుల్లోనే 60కిపైగా కుక్కకాటు, కోతికాటు కేసులు
– బెంబేలెత్తుతున్న రుద్రంపూర్, గౌతమ్పూర్, ధన్బాద్ పంచాయతీల ప్రజలు
చుంచుపల్లి, సెప్టెంబర్ 08 : రుద్రంపూర్, గౌతమ్పూర్, ధన్బాద్ పంచాయతీల పరిధిలో కోతులు, వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కోతుల గుంపులు రోడ్లపై సంచరిస్తూ నడిచివెళ్లే ప్రజల చేతుల్లోని సంచులను లాక్కెళ్లడం, ప్రయాణికులను వెంబడించడం, ఇళ్లలోకి చొరబడటం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వీధికుక్కలు గుంపులుగా తిరుగుతూ చిన్నారులు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులపై దాడులకు పాల్పడుతున్నాయని తెలిపారు.
కోతులు, కుక్కల దాడుల తీవ్రతకు పెనగడప పీహెచ్సీలో నమోదవుతున్న కేసులే నిదర్శనమని స్థానికులు చెబుతున్నారు. కేవలం 30 రోజుల వ్యవధిలోనే కుక్కకాటు, కోతికాటు ఘటనలకు సంబంధించి 60కి పైగా కేసులు నమోదైనట్లు వైద్యుల సమాచారం. ఈ గణాంకాలు మూడు పంచాయతీల పరిధిలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తున్నాయన్నారు.
ఇటీవల రుద్రంపూర్లో కోతి దాడిలో ఓ మహిళ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందిన ఘటనతో పాటు, ఓ చిన్నారిని కోతి కరవడంతో హైదరాబాద్కు తరలించి చికిత్స అందించాల్సి వచ్చిందని స్థానికులు తెలిపారు. ఇలాంటి ఘటనలు మూడు పంచాయతీల పరిధిలో పలుమార్లు చోటుచేసుకున్నాయని చెప్పారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఒంటరిగా బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొందన్నారు.
కోతులు, కుక్కల బెడదపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పంచాయతీ అధికారుల దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లినట్లు తెలిపారు.
గౌతమ్పూర్ పంచాయతీలో సుమారు రూ.కోటి నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రజలకు నిత్య సమస్యగా మారిన కోతులు, కుక్కల నియంత్రణకు వాటిని వినియోగించకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిధులను కేవలం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకే వినియోగించాలన్న విధానం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. ప్రజల భద్రతకు సంబంధించిన అత్యవసర సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేయాలని కోరుతున్నారు.
కోతులు, కుక్కల బెడద నుండి తమకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతూ గౌతమ్పూర్ పంచాయతీ ప్రజలు గతంలో నిర్వహించిన గ్రామ సభలో పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్కు వినతిపత్రం సమర్పించారు. సమస్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అయినప్పటికీ అధికారులు స్పందించి చర్యలు చేపట్టకపోతే ఇకపై గ్రామ సభలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఇకనైనా అధికారులు స్పందించి మూడు పంచాయతీల పరిధిలో కోతులు, కుక్కల బెడదను నియంత్రించి ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.