చండ్రుగొండ, ఆగస్టు 26 : బీఆర్ఎస్ పార్టీకి గ్రామాల్లో కార్యకర్తలే పునాదిరాళ్లు వంటి వారిని అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరు, రావికంపాడు గ్రామాల్లో గ్రామ కమిటీల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పార్టీ దిమ్మలను ప్రారంభించి పార్టీ జెండాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మెచ్చ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అలివిగానీ హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. రైతులకు కనీసం ఎరువులు ఇవ్వలేని ప్రభుత్వం భేషరతుగా రైతాంగానికి క్షమాపణ చెప్పాలన్నారు. అనంతరం అయ్యన్నపాలెం గ్రామంలో అకస్మాత్తుగా మృతి చెందిన ఆటో డ్రైవర్ నాగులు మీరా కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, శ్రేణులు, గ్రామ, మండల కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.