– టవర్లు ఉన్నా అందని సిగ్నల్స్
– ప్రజలకు తప్పని ఇబ్బందులు
దుమ్ముగూడెం, ఆగస్టు 26 : నేటి టెక్నాలజీ యుగంలో సెల్ఫోన్ మనుషులకు ఒక ముఖ్యమైన నిత్యావసర వస్తువుగా మారిపోయింది. సమాచార ప్రసారం, డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ విద్యాభ్యాసం, ప్రయాణాలు, మ్యాప్స్, అత్యవసర పరిస్థితులు, వినోదం ఇలా ప్రతి దానికి సెల్ఫోన్ ఆధారంగా మారింది. మానవ జీవితంలో ఇంతటి ప్రాముఖ్యం కలిగిన సెల్ఫోన్ సర్వీసులు మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని పలు గ్రామాల్లో మాత్రం నెట్వర్క్ సమస్యలతో ప్రజలను వేధిస్తున్నాయి. సెల్ ఫోన్ సేవలు అందుబాటులోకి వస్తాయని భావించిన ప్రజలకు నిరాశే మిగులుతోంది. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సెల్ టవర్లు అలంకారప్రాయంగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చిన్నబండిరేవు, సీతానగరం, ప్రగల్లపల్లి, దుమ్ముగూడెం తాసిల్ గ్రామాల్లో సెల్ టవర్లు ఉన్నప్పటికీ సిగ్నల్స్ సరిగ్గా అందకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా మండలంలోని ఎస్ కొత్తగూడెం, సుంకర కాలనీ, పేదనల్లపల్లి, చిన్నల్లపల్లి, కే లక్ష్యంపురం, చింతగుప్ప, కాశీనగరం, సీతానగరం, పర్ణశాల, ప్రగల్లపల్లి గ్రామాల ప్రజలు ఫోన్ మాట్లాడేందుకు ఇళ్ల నుండి బయటకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్ కోసం ఎత్తైన ప్రదేశాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో నెట్వర్క్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారికి వైద్య సేవల కోసం, అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేయడం కూడా కష్టంగా మారింది.
విద్యార్థులు, ఉద్యోగులు ఆన్లైన్ సేవలు వినియోగించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారులు సైతం డిజిటల్ లావాదేవీలకు నెట్ వర్క్ పై ఆధారపడాల్సి వస్తోంది. నెట్ వర్క్ అంతరాయాలతో నగదు రహిత లావాదేవీలు నిలిచిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలు కూడా ఆన్ లైన్ ఆధారితంగా మారాయి. దీంతో నెట్ వర్క్ లేకపోవడం ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. నెలవారీ రీచార్జిలు ఒక్క రోజు ఆలస్యమైన సిగ్నల్స్ను కట్ చేసే మొబైల్ ఆపరేటర్లు సరైన సిగ్నల్స్ సర్వీసును వినియోగదారులకు అందించడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, సెల్ కంపెనీలు తక్షణమే స్పందించి గ్రామాల్లో నెట్ వర్క్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.