– ముఖ్య అతిథిగా పాల్గొన్న అతా నిజాముద్దీన్ బాబా
పాల్వంచ, సెప్టెంబర్ 07 : మహ్మద్ ప్రవక్త జన్మదిన మాసం రబీ ఉల్ అవ్వల్ను పురస్కరించుకుని దారుల్ ఉలూం నూరియా హనఫియా హిఫ్జ్ మదర్సా అధ్యక్షుడు షేక్ యూసఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిలాద్ ఉన్ నబీ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ వక్త అతా నిజాముద్దీన్ బాబా హాజరై మాట్లాడుతూ.. మహ్మద్ ప్రవక్త బోధనలు యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచాయని అన్నారు. పేదల పట్ల దయ, కరుణ, ప్రేమ కలిగి ఉండాలని, నిరాడంబర జీవితాన్ని గడుపుతూ యావత్ ప్రపంచంలో ఇస్లాం వ్యాప్తికి మహ్మద్ ప్రవక్త కృషి చేశారని పేర్కొన్నారు. ప్రతి ముస్లిం ప్రవక్త చూపిన మార్గంలో నడవాలని, తద్వారా ఇహలోకంలోనూ, పరలోకంలోనూ మేలు జరుగుతుందని అన్నారు.
అనంతరం మదర్సా చైర్మన్ యాకూబ్ పాషా మాట్లాడుతూ.. మహ్మద్ ప్రవక్త ఆశయ సాధన దిశగా ప్రతి ఏడాది మిలాద్ ఉన్ నబీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా సమాజంలో శాంతి, సోదరభావం నెలకొల్పేందుకు దోహదపడుతుందని అన్నారు.
కార్యక్రమంలో మదర్సా కమిటీ సభ్యులు గౌస్ పాషా, ఇక్బాల్తో పాటు స్థానిక మసీదులకు చెందిన ఇమామ్లు మౌలానా సర్ఫరాజ్ ఆలం, మౌలానా ఖుస్రు అహ్మద్, మౌలానా ఇమ్రాన్ రజా, ఖాజీ రఫీయుద్దీన్, అబ్దుల్ సలాం, షవూద్ రజా పాల్గొన్నారు.