రామవరం, మార్చి 25 : ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఆవిర్భవించి 36 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం వార్షికోత్సవ వేడుకలు రేడియో స్టేషన్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. స్టేషన్ ప్రోగ్రాం హెడ్ బైరి శ్రీనివాసన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ”శ్రోతలతో ఆత్మీయ సమ్మేళనం” ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రేడియో శ్రోతలు కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా గత 36 సంవత్సరాలుగా ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించి శ్రోతలను అలరిస్తున్న తీరును ఈ సందర్భంగా వారు ప్రశంసించారు. ఆకాశవాణి ఏర్పాటు నుండి రేడియో కార్యక్రమాలు వింటున్న శ్రోతలు వారి అభిప్రాయాలు, అనుభూతులను ఈ సందర్భంగా పంచుకున్నారు. అనంతరం ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన శ్రోతలను ఆకాశవాణి అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వహణ అధికారి కొలిపాక శంకరరావు, ఇంజినీర్ బాబుసింగ్, బొల్లవరపు ప్రసాద్, స్వామి, సిబ్బంది, రేడియో జాకీలు పాల్గొన్నారు.