బూర్గంపహాడ్, ఏప్రిల్ 21 : ఎండను సైతం లెక్కచేయడకుండా 27 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపడుతున్నా కార్మిక సమస్యలు గాలికొదిలేసి ఐటీసీ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితో ఉందని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, ఎండీ యాకూబ్పాషా, బల్లెం నాగయ్య మండిపడ్డారు. మంగళవారం 27వ రోజుకు కార్మికుల దీక్షలు చేరాయని, రోజులు గడుస్తున్నా యాజమాన్యం మాత్రం కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దీక్షల్లో కూర్చున్న పాటి సోమిరెడ్డి, పోతిని గోపాలరావు, బత్తుల శ్రీనివాసరావు, శనగ వీరకుమార్కు బీఆర్డీయూ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము శంకర్రెడ్డి, చుక్కపల్లి బాలాజీ పూలమాల వేసి సంఘీభావం ప్రకటించారు.
కార్మికుల సమస్యలను పరిష్కరించని యాజమాన్యంపై జేఏసీ ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధంగా ఉందని రేపో, మాపో సమ్మెకు వెళ్లేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. యాజమాన్యం తన వైఖరి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో కార్మికుల పోరాటం మరింత ఉధృతం చేస్తామని, జేఏసీతో చర్చలకు ఐటీసీ యాజమాన్యం త్వరితగతిన వచ్చి కార్మిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షా శిబిరంలో జేఏసీ సభ్యులు సూరిశెట్టి జగదీష్, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.