బూర్గంపహాడ్, ఆగస్టు 24 : పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు సత్వర పరిష్కారం చూపాలని భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం బూర్గంపహాడ్ పోలీస్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. తొలుత ఎస్పీకి పాల్వంచ డీఎస్పీ సతీశ్ కుమార్ ఘన స్వాగతం పలికారు. స్టేషన్లో పని చేస్తున్న సిబ్బంది నుండి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వివిధ సమస్యలపై స్టేషన్కు వచ్చిన బాధితులతో మర్యాదగా వ్యవహరించి సమస్యలకు పరిష్కారం చూపేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు.
స్టేషన్లో వివిధ వర్టికల్స్లో విధులు నిర్వహించే సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో నమోదైన యూఐ కేసులు, గ్రేవ్ కేసులు, ప్రాపర్టీ కేసుల వివరాలు సమీక్షించి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి ప్రతి కేసును నాణ్యతతో దర్యాప్తు చేసి సత్వర పరిష్కారం చూపాలన్నారు. ప్రాపర్టీ, దొంగతనం కేసులపై ప్రత్యేక దృష్టి సారించి నిందితులను గుర్తించి అరెస్టు చేయడంతో పాటు చోరీకి గురైన ఆస్తిని రికవరీ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. నేరచరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, స్టేషన్ రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. సీసీటీఎన్ఎస్ 2.0లో కేసుల వివరాలు సక్రమంగా నమోదు చేసి ఈ సాక్ష్య, నాట్రిడ్, గాండీవ వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు.
అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచి కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగాలపై ప్రత్యేక దృష్టి సారించి యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకుని సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం అధికారులు, సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీఐ సతీష్, ఎస్ఐలు మేడా ప్రసాద్, నాగభిక్షం, రామ్మూర్తి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు