– రాష్ట్ర కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్కు ఐఎన్టీయూసీ వినతి
బూర్గంపహాడ్, ఏప్రిల్ 15 : పారిశ్రామిక వాడ సారపాకలోని ఐటీసీ కర్మాగారంలో 14వ వేతన ఒప్పందంలో జరుగుతున్న జాప్యం, పరిశ్రమలో ఆందోళనకర పరిస్థితులపై యాజమాన్య నిర్లక్ష్య ధోరణిపై జోక్యం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్ పమేలా సతృతిని హైదరాబాద్లో ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. నేతన ఒప్పందం కార్మికులకు ఆమోదయోగ్యంగా ఉండేలా పూర్తి చేయాలన్నారు. 18వ వేతన ఒప్పందంలో సమస్యలు గాలికొదిలేసి ఇప్పుడు 14వ వేతన ఒప్పందం సమయంలో గుర్తింపు సంఘం మళ్లీ అబద్దపు ప్రచారాలతో కార్మికుల ముందుకు వస్తుందని, ఎన్నికల్లో గెలవడానికి 22 వేలు సాధిస్తామని ప్రగల్భాలు పలికి తీరా సమయం వచ్చేసరికి కేవలం 9వేలు అని చెప్పడం చేతగానితనానికి నిదర్శనమన్నారు. యాజమాన్యం ఒప్పుకోవడం లేదని నష్టాల్లో ఉందని కుంటిసాకులు చెబుతూ కార్మికులను తప్పుదోవ పట్టించే కుట్రలు చేస్తున్నారని.. ఇంత జరుగుతున్నా ఐటీసీ యాజమాన్యం కళ్లుండి చూడలేకపోతుందని, గుర్తింపు సంఘానికి వత్తాసు పలుకుతుందన్నారు.
18 నెలల క్రితం గుర్తింపు సంఘాన్ని గెలిపించడానికి దొంగ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటికీ పూర్తి చేయకుండా బదిలీ, కాంట్రాక్టు కార్మికులను నట్టేట ముంచుతోందని, మరో పక్క కాంట్రాక్టు కార్మికులు ఇప్పట్ని సమ్మె నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారన్నారు. ఐటీసీలో కార్మికుల పట్ల జరుగుతున్న ఆరాచకాలను భరించలేక రాష్ట్ర కార్మిక శాఖకు వినతిపత్రం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమస్యలపై స్పందించిన రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ త్వరలో యాజమాన్యంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పినట్లు ఆయన పేర్కొన్నాడు. కార్మికులకు న్యాయం జరిగేంత వరకు ఐఎన్టీయూసీ పోరాటం కూడా ఆగదని, ఇందుకోసం కార్మికులు ఏకం కావాలని కోరారు.