– 43 ఏళ్ల సుదీర్ఘ సేవకు ఘన వీడ్కోలు
మణుగూరు టౌన్, ఆగస్టు 31 : మణుగూరు ఏరియాలోని పీకేఓసీ-2 మైన్లో 43 సంవత్సరాల సుదీర్ఘ సేవను విజయవంతంగా పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందిన హెడ్ ఓవర్మెన్ కోల గురుమూర్తికి అధికారులు, సహచర ఉద్యోగులు ఆత్మీయంగా ఘన సన్మానం చేసి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ మేనేజర్ సౌరబ్ సుమన్ మాట్లాడుతూ.. 43 సంవత్సరాల పాటు సింగరేణి సంస్థకు కోల గురుమూర్తి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. 1982 అక్టోబర్ 12న బదిలీ వర్కర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన, కష్టపడి పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి హెడ్ ఓవర్మెన్ స్థాయికి చేరుకోవడం ఆయన నిబద్ధత, కృషి, అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే విధుల పట్ల నిజాయితీగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సంస్థ అభివృద్ధికి తన వంతు సేవలందించారని తెలిపారు. తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.
పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి మాత్రమే విరామమని, జీవిత ప్రయాణానికి కాదని సౌరబ్ సుమన్ అన్నారు. ఇకపై కోల గురుమూర్తి ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సురేష్ కుమార్, అడిషనల్ మేనేజర్ నాగేంద్ర, సేఫ్టీ ఆఫీసర్ నరసింహారావు, వెల్ఫేర్ ఆఫీసర్ వంశీకృష్ణ, షిఫ్ట్ ఇంచార్జ్ నరేష్ కుమార్, హెడ్ ఓవర్మెన్ కోల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని కోల గురుమూర్తిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.