రామవరం, ఏప్రిల్ 17 : కుల మతాలకు అతీతంగా ప్రతి పండుగను ఆనందం కలిసి జరుపుకోవాలని అప్పుడే సమాజంలో శాంతి, సామరస్యం వెల్లివిరుస్తుందని కొత్తగూడెం టూ టౌన్ ఎస్ఐ సిల్వరాజ్ అన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధి 12వ వార్డులోని సుభాశ్ చంద్రబోస్ నగర్, రామవరంలో జమాతే ఇస్లామి హింద్ మస్జీద్ ఏ ఆది కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈద్ మిలాఫ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విశ్వ హిందు పరిషత్ సీనియర్ సభ్యుడు కొదమ సింహం పాండురంగాచార్యులు మాట్లాడుతూ.. హిందూ ముస్లిం భాయి భాయిగా కలిసి మెలిసి జీవించడంలో మన కొత్తగూడెం ముందుంటుందన్నారు. జమాతే ఇస్లామి హింద్ ఇలా అందరినీ కలిపి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు.
జమాత్ జిల్లా అధ్యక్షుడు షారుఖ్ యాజ్దాని మాట్లాడుతూ.. రంజాన్ మాసంలో మానవాళి మార్గదర్శి ఖురాన్ అవతరించిన మాసం అని మనిషిని మంచివాడిగా, మానవతా విలువలు కలిగిన మనిషిగా జీవించేలా రంజాన్ ఉపవాసాలు శిక్షణ ఇస్తాయన్నారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఫహీం దాదా మాట్లాడుతూ భిన్న సంస్కృతులకు నిలయం అయిన భారత దేశంలో కొందరు స్వార్ధ రాజకీయ నాయకులు హిందూ ముస్లింల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు షేఖ్ అబ్దుల్ బాసిత్, సుధాకర్, నారాయణ, మసీదు కమిటీ అధ్యక్షుడు జైనులాబుద్దీన్, కలీం, మస్తాన్, అఫ్జల్, మౌలానా రహ్మతుల్లా హుస్సేనీ, రబ్బానీ, ఇర్ఫాన్, సమీర్ పాల్గొన్నారు.