భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : దేశ ప్రథమ మహిళా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు ఏర్పాట్లు ఘనంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. ఈ నెల 28వ తేదీన భారత రాష్ట్రపతి భద్రాచలం పర్యటన పురస్కరించుకొని విధులు కేటాయించిన జిల్లా అధికారులతో శుక్రవారం కలెక్టరేట్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రొటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు ఈ నెల 26వ తేదీ వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. హెలీప్యాడ్లు ఏర్పాటు ప్రక్రియ గురించి ఆర్అండ్బీ ఈఈ భీమ్లాను అడిగి తెలుసుకున్నారు. పటిష్టమైన, కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని అన్నారు. మహబూబాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభోత్సవాలు వర్చువల్ విధానం ద్వారా రాష్ట్రపతి నిర్వహించనున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని ఎన్ఐసీ సిబ్బందిని ఆదేశించారు. చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా 26వ తేదీ వరకు కేటాయించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అధికారులు సంసిద్ధంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచాలని అన్నారు. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణకు సిబ్బందిని నియమించి పట్టణాన్ని పరిశుభ్రంగా తయారు చేయాలని పంచాయతీ అధికారులకు సూచించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీవో మధుసూదన్రాజు, డీపీవో రమాకాంత్, విద్యుత్శాఖ ఎస్ఈ రమేశ్, ఆర్అండ్బీ ఈఈ భీమ్లా, పంచాయతీరాజ్ ఈఈ సుధాకర్, వైద్యాధికారులు శిరీష, రవిబాబు, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్, కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవోలు స్వర్ణలత, రత్నకల్యాణి తదితరులు పాల్గొన్నారు.