ములకలపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల శివారు ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు అటవీప్రాంతంలో పందెంరాయుళ్లు పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహిస్తుండగా పోలీసులు 46 ద్విచక్రవాహనాలు, 15 కోడిపుంజులు, రూ.14,970 నగదు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎనిమిది పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
మండల పరిధిలోని మంగళిగుట్ట ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులోని అటవీప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న పాల్వంచ టౌన్ ఎస్సై ప్రవీణ్, రూరల్ ఎస్సై సుమన్, స్పెషల్బ్రాంచి ఎస్సై వసంతరావు, ములకలపల్లి ట్రైనీ ఎస్సై నాగభిక్షంలు బృందంగా ఏర్పడి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. నిందితులపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.