బూర్గంపహాడ్, జూలై 17 : బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పూర్తిస్థాయిలో జరిగేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు, సర్ ప్రోగ్రామ్ ఇన్చార్జి దిండిగల రాజేందర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సారపాకలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా ఇన్చార్జి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ సభ్యత్వనమోదును త్వరితగతిన పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను వారికి వివరించారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు డిజిటలైజేషన్ పద్ధతిలో జరగాలని ఇప్పటికే పార్టీ నిర్ణయించిందని, ఈ మేరకు ఇక్కడి ముఖ్య నాయకులు సభ్యత్వ నమోదు విజయవంతానికి కృషి చేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు.
అంతేకాకుండా కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన జాతీయ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో పార్టీ నియమించిన బీఎల్ఎలు ఓటర్ల ఇళ్లకు వెళ్లినప్పుడు ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడంతో వారి విధులు ముగియలేదని, ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారాలు అందించడంతో పాటు బీఎల్వోలతో వాటిని పూర్తిచేయించి ఆన్లైన్లో నిక్షిప్తం చేసినప్పుడే ఓటుకు అర్హత ఉంటుందని, ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా మండలంలో సర్ కార్యక్రమం నిర్వహించి విజయవంతం చేయాలని బీఎల్ఎలుగా ఉన్న పార్టీ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీనివాసరావు, తాళ్లగొమ్మూరు సర్పంచ్ గుమ్మడి కృష్ణవేణి, యూత్ నాయకులు చల్లకోటి పూర్ణ, సోము లక్ష్మిచైతన్యరెడ్డి, నాయకులు బెజ్జంకి కనకాచారి, పంగి సురేష్, బానోతు శ్రీను, తిరుపతి ఏసోబు, చట్టు ఆంజనేయులు, కర్రి నాగేశ్వరరావు, మోహన్, ఖాదర్ పాల్గొన్నారు.