జూలూరుపాడు, ఏప్రిల్ 08 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 27వ తేదీన జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను అడ్డుకుందుకే కాంగ్రెస్ ప్రభుత్వం సిటీ పోలీస్ యాక్ట్ను నెల రోజుల పాటు అమలు చేసిందని ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు లాకావత్ గిరిబాబు అన్నారు. మంగళవారం ఆయన స్పందిస్తూ.. బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక, ప్రశ్నించిన వారిపై తన అక్కసును వెళ్లగక్కుతున్నాడని విమర్శించారు. ప్రశ్నించే గొంతులను నొక్కి పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం ప్రతిపక్ష నాయకులపై, బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతూ పోలీస్ వ్యవస్థను తన సొంత ఎజెండాకు వాడుకుంటున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులు కేసులకు భయపడరని తేల్చి చెప్పారు. రజతోత్సవ సభ జరుగకుండా సీఎం రేవంత్ రెడ్డి చేసే కుటిల ఎత్తులను తిప్పి కొడతామని పేర్కొన్నారు. సిటీ పోలీస్ యాక్ట్ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.