రుద్రంపూర్, ఆగస్టు 26 : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జీవిత చరిత్ర, ఆశయాలు, రాజ్యాంగ విలువలు, సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటాన్ని ప్రతిబింబిస్తూ ప్రదర్శించిన ‘సంఘం శరణం గచ్చామి’ నాటిక ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కొత్తగూడెం ఏరియాలోని గౌతంపూర్ కమ్యూనిటీ హాల్లో మంగళవారం రాత్రి సింగరేణి కాలరీస్ కంపెనీ సహకారంతో హైదరాబాద్కు చెందిన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నాటికను ప్రదర్శించారు. కార్యక్రమానికి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సి.హెచ్.వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి నాటికను ప్రారంభించారు. అంబేద్కర్ బాల్యం నుండి విద్యాభ్యాసం, ఆయన ఎదుర్కొన్న సామాజిక వివక్ష, విద్య ద్వారా సాధించిన ఉన్నత స్థానం, అణగారిన వర్గాల హక్కుల కోసం సాగించిన పోరాటం, భారత రాజ్యాంగ రూపకల్పనలో పోషించిన కీలక పాత్ర వంటి అంశాలను కళాకారులు భావోద్వేగభరితంగా ఆవిష్కరించారు.
నాటికను ఆద్యంతం వీక్షించిన జీఎం వెంకటరమణ మాట్లాడుతూ.. అంబేద్కర్ జీవితం, ఆయన ఆశయాలు, సమాజానికి అందించిన సేవలు, సమానత్వం, సామాజిక న్యాయం కోసం సాగించిన పోరాటాన్ని కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారని అభినందించారు. ఇటువంటి కళా, సాంస్కృతిక కార్యక్రమాలు సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, విద్యార్థులు, ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దోహదపడతాయని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాటికలు, ఇతర కళారూపాలు ప్రభావవంతమైన మాధ్యమాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఆకట్టుకున్న‘సంఘం శరణం గచ్చామి’
అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇదే వేదికపై బుధవారం మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జీవిత చరిత్ర, ఆశయాలను ప్రతిబింబించే ‘సత్యశోధన’ నాటికను ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం గోవిందరావు, సీఎంఓఏఐ జనరల్ సెక్రటరీ ఉపేంద్రబాబు, పర్సనల్ మేనేజర్ ఎల్. తిరుపతి, అనంతరామయ్య, ఎస్సీ/ఎస్టీ జనరల్ సెక్రటరీ అంతోటి నాగేశ్వరరావు, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ జె.గట్టయ్య, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎం.డి.రజాక్, డీవైపీఎం హరీష్, సీనియర్ పీవో మజ్జి మురళి, ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రటరీ సాగర్, అధికారులు, ఉద్యోగులు, యూనియన్ నాయకులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.