ఇల్లెందు, జూన్ 21: తెలంగాణ తొలి గొంతుక.. ఆజన్మాంత ఉద్యమ పతాక.. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ నివాళులర్పించారు. ఇల్లెందులోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం జయశంకర్ సర్ చిత్రపటానికి పూలమాల వేశారు. ఆమె మాట్లాడుతూ.. 1954లోనే విశాలాంధ్ర ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించిన.. తెలంగాణ నినాదాన్ని వినిపించిన తొలి గొంతుకగా, జీవిత చరమాంకంలోనూ తెలంగాణనే శ్వాసించి.. ఆజన్మాంతం ఉద్యమ పతాకగా నిలిచారని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక భూమికను రూపొందించి, ప్రత్యేక రాష్ట సాధన కాంక్షను గల్లీ నుంచి ఢిల్లీ వరకూ తీసుకెళ్లిన జయశంకర్ సర్.. ‘తెలంగాణ జాతి పిత’గా చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించారని నివాళి అర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జయశంకర్ విగ్రహానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యమకారులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఉద్యమ నాయకుడు షేక్ ముబారక్ బాబా, ప్రధానోపాధ్యాయుడు రాంబాబు, ఎస్ఎంసీ చైర్మన్ దివిలి ప్రసాద్ పాల్గొన్నారు.
చండ్రుగొండ, జూన్ 21: చండ్రుగొండలో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారా బాబు, నాయకులు చీదెళ్ల పవన్కుమార్, సూర వెంకటేశ్వరరావు, వంకాయలపాటి బాబురావు, మల్లేల వెంకటేశ్వర్లు, బానోత్ బీలు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో జయశంకర్ సర్ విగ్రహానికి ప్రధానోపాధ్యాయుడు మస్తాన్ అలీ, ఎస్ఎంసీ చైర్మన్ పాకనాటి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు చిన్ని, కొండలరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.