ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
కురిసిన వానతో ప్రజలకు ఉపశమనం
రైతులు దుక్కులు సిద్ధం చేసేందుకు అవకాశం
కూసుమంచి/ ఖమ్మం రూరల్/ కూసుమంచి రూరల్/ ముదిగొండ/బోనకల్లు :విపరీతమైన ఎండలతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు గురువారం ఒక్కసారిగా ఉపశమనం లభించింది. ఉదయం చల్లబడి కారుమబ్బులు కమ్ముకొని జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో సుమారు గంట పాటు వర్షం కురిసింది. దీంతో పలు మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పలు చోట్ల విద్యుత్ సరాఫరాకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మం రూరల్ మండలంలోని మంగళగూడెం శివారు కొత్తూరు గ్రామం, తీర్థాలలోని సుబాబుల తోటలో, పలిశెట్టిగూడెం గ్రామ శివారులో పిడుగులు పడ్డాయి. అయితే ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగలేదు. ముత్తగూడెం పరిధిలోని సబ్స్టేషన్లో ఉన్న విద్యుత్ ఓల్టేజీ నియంత్రికలో ఉరుములు, మెరుపులు రావడంతో మంటలు వ్యాప్తి చెందాయి. ఫైర్ సిబ్బంది హుటాహుటినా అక్కడికి చేరుకుని మంటలు ఆర్పి వేశారు. మరోవైపు ఈ భారీ వర్షంతో దుక్కులు సిద్ధం చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. వచ్చే పది రోజుల్లో మరో రెండు దఫాలు ఇదే మోస్తరులో వర్షాలు కురిస్తే, పెసర, కంది, మొక్కజొన్న, పత్తి వంటి మెట్ట పంటలు వేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ నెలాఖరుకు వరి, మిర్చి నార్లు పోసుకోవడానికి రైతులు సమాయత్తమవుతారు.