అడవి జంతువుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో జంతువులు కరోనా బారిన పడకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. అభయారణ్యంలో స్వేచ్ఛగా విహరించే జంతువులకో, పార్కుల్లో ప్రదర్శనలో ఉన్న జంవుతులకో వైరస్ సోకితే కనిపెట్టడం ఎలా?’ అంటే వాటిని కూడా ఎప్పకటిప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెబుతున్నారు అటవీ శాఖ అధికారులు. ఎక్కడ ఆనవాళ్లు కన్పించినా తక్షణమే స్పందిస్తామని చెబుతున్నారు.
కరోనా మహమ్మారి ప్రతిచోటకూ విస్తరిస్తోంది. ఇప్పటి వరకు మనుషులకే పరిమితమైన వైరస్ జంతువులకూ వ్యాపిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో అటు జంతువులు కూడా డేంజర్జోన్లోకి వెళ్తున్నాయి. ఈ పరిణామం మనుషులకు కూడా మరింత ప్రమాదకరంగా మారుతోంది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ జూపార్క్లో ఓ సింహానికి కరోనా లక్షణాలున్నాయనే వార్త చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో జంతువులకు వైరస్ సోకకుండా ఉండేందుకు అనేక చర్యలు చేపట్టారు. ఇక అటవీ ప్రాంతాల్లో ఉండే వివిధ రకాల జంతువులను సంరక్షించేందుకు అటవీశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అటవీ శాఖ సిబ్బందికి ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కిన్నెరసాని వైల్డ్లైఫ్కు సంబంధించి జూపార్క్ గేట్లు మూసి వేశారు. సందర్శకులను అనుమతించడం లేదు. అటవీ ప్రాంతాల్లో జంతువులకు ఇబ్బంది కలుగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
కట్టుదిట్టమైన చర్యలు
కొవిడ్ సెకండ్ వేవ్ జంతువులపై ప్రభావం చూపకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. మనుషులతోనే జంతువులకు వైరస్ సోకే అవకాశ ఉందని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ జంతువులకూ సోకితే ఆ చైన్ను ఆపడం కష్టమవుతుంది. ఈ క్రమంలోనే అటవీ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జంతువులకు వైరస్ సోకకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలకూ ఉపక్రమించారు. ఇందులో భాగంగా అటవీశాఖ సిబ్బంది ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా, జ్వరం బారిన పడినా వారిని విధులకు రాకుండా ఐసోలేట్ చేస్తున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ సమయంలో జన సంచారం ఎక్కువగా లేకపోయినప్పటికీ జూ పార్కులు, అటవీ ప్రాంతాల్లోకి జనం రాకుండా చూస్తున్నారు. జూ పార్కుల్లో అయితే జంతువులకు ఆహారం అందించేందుకు ఆరోగ్యంగా ఉన్న సిబ్బందినే పంపుతున్నారు.
అటవీ ప్రాంతంలో మానిటరింగ్
ఇక అడవుల్లో ఎవరూ సంచరించకుండా గతంలోనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల ఫొటోలు, వీడియోల ద్వారా అటవీ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. వీడియోలను రెండు రోజులకు ఒకసారి బయటకు తీసి పరిశీలిస్తారు. ఈ వీడియోల్లో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు కనిపిస్తే వారిని కనిపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే కెమెరాల ద్వారా జంతువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఏ జంతువైనా నీరసంగా ఉన్నట్లు కనిపిస్తే వెంటనే ఆ జంతువుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, ఆ జంతువును ఇతర జంతువులకు దూరంగా ఉంచుతామని, అది కోలుకునే వరకూ జాగ్రత్త చర్యలు తీసుకుంటామని అటవీ అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు తాము పరిశీలించిన వీడియోల్లో ఏ ఒక్క జంతువు కూడా అనారోగ్యంగా కనిపించలేదని, అన్నీ ఆరోగ్యంగానే అడవిలో సంచరిస్తున్నాయని తెలిపారు. కిన్నెరసాని వైల్డ్లైఫ్ జూపార్కులోని జంతువులు కూడా పూర్తి అరోగ్యంతో ఉన్నాయన్నారు.
జంతువుల సంరక్షణకు చర్యలు..
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో జంతువుల సంరక్షణకు పూర్తి చర్యలు తీసుకుంటున్నాం. మనుషుల నుంచి జంతువులకు వైరస్ వ్యాపించే ప్రమాదం ఉండడంతో జూపార్కుల్లో, అడవుల్లో వ్యక్తుల సంచారం లేకుండా పర్యేవేక్షిస్తున్నాం. మా సిబ్బందిలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారిని ఐసోలేషన్లో ఉంచుతున్నారు. వారిని జంతువుల వద్దకు వెళ్లనీయడం లేదు. సీసీ కెమెరాల ద్వారా జంతువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం.
-రంజిత్నాయక్, డీఎఫ్వో, భద్రాద్రి కొత్తగూడెం