బూర్గంపహాడ్, ఏప్రిల్ 15 : రోడ్డు ప్రమాదాల నివారణ ఉద్యమమే ‘అరైవ్-ఆలైవ్’ అని బూర్గంపహాడ్ ఎస్ఐ మేడా ప్రసాద్ అన్నారు. బుధవారం రోడ్డు ప్రమాదాల నివారించడానికి చేపట్టిన అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ మందా నాగరాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కలిసి మండల కేంద్రంలో ర్యాలీలు, అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, లైసెన్స్, వాహన పత్రాలు లేకుండా వాహనాలు నడపకూడదని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని, మద్యం సేవించి, ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపితే ప్రమాదాలు చోటుచేసుకుంటాయని అవగాహన కల్పించారు. అనంతరం ప్రధాన సెంటర్లో వచ్చి పోయే వాహన పత్రాలను తనిఖీ చేసి వారికి రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించారు. అదేవిధంగా విద్యార్ధులు, ప్రజలు, వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంఈఓ యదుసింహరాజు, పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.