రుద్రంపూర్, ఏప్రిల్ 16 : అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నేషనల్ అభ్యుదయ రత్న–2026 అవార్డును రామవరం పరిరక్షణ సమితి అధ్యక్షుడు మహమ్మద్ ముస్తఫా అందుకున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్ చిక్కడపల్లిలో గల త్యాగరాయ గానసభలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖుల సమక్షంలో ముస్తఫాకు అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంస్థ ఫౌండర్, నేషనల్ చైర్మన్ డా. కె. చక్రవర్తి, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, న్యూమరాలజిస్ట్ దివంగ శర్మ, రిటైర్డ్ జడ్జి బూర్గుల మధుసూదన్, రిటైర్డ్ ఐఏఎస్ బి.లక్ష్మీకాంతం, రిటైర్డ్ ఎస్పీ ఎస్.ఎం. రత్న, అష్టావధాని సురభి శంకర శర్మ, రిటైర్డ్ డీఎస్పీ డాక్టర్ జి. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
రామవరం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కోసం కృషి చేయడంతో పాటు, కరపత్రాలు, కవితల ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యం కల్పిస్తున్నందుకు గాను ముస్తఫా ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ముస్తఫాను ప్రకృతి, పర్యావరణ ప్రేమికులు మొక్కల వెంకటయ్య, మొక్కల రాజశేఖర్, సుగుణారావు, తూముల శ్రీనివాస్, సావేటి స్వామి, నజీర్, తులసి రామ్, యశ్వంత్, కొయ్యడ వెంకటేశ్వర్లు, రాజారాం, దశరథ్ రజ్వ తదితరులు అభినందించారు.