ఖమ్మం: వికాస తరంగిణి ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి పండుగ సందర్భంగా ఉచిత ఆయుర్వేద ఔషధం పంపిణి చేయనున్నట్లు వికాస తరంగిణి బాధ్యులు ఎర్నేని రామారావు, పోలా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం నగరంలోని జడ్పీ సెంటర్లోని పోలాస్ జూస్ పాయింట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. శ్రీత్రిదండి చిన్న జీయర్ స్వామి దివ్య మంగళాశాసనాలతో ఖమ్మం సౌభాగ్య షాపింగ్ మాల్ సౌజన్యంతో రాత్రి 12 గంటల నుంచి ఉచిత ఆయుర్వేద ఔషధం పంపిణి చేయనున్నదని తెలిపారు.
జలుబు, ఆస్తమా, సైనస్, అన్ని రకాల అలర్జీలతో బాధపడుతున్న రోగులకు ఈ మందు బాగా ఉపయోగపడుతుందన్నారు. ఈ మందును తీసుకున్నవారు15 రోజుల వరకు మాంసాహారం మానివేయాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. సమావేశంలో వికాస తరంగిణి కో-ఆర్డినేటర్లు శాంతి, రవీందర్, వీరభద్రం, ఉష తదితరులు పాల్గొన్నారు.