ఖమ్మం : ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించి ప్రమాద రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్ పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలోనగరంలోని ఎన్సీసీ విద్యార్థులకు ఎస్ఆర్ బీజిఎన్ ఆర్ కాలేజీలో ట్రాఫిక్ పోలీసుల విధులు , ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రధానంగా యువతకు , విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని , బైక్ నడిపే వాళ్లు హెల్మెట్ ధరించాలని అలాగే కారు నడిపే ప్రతిఒక్కరూ సీటు బెల్ట్ విధిగా పెట్టుకోవాలని సూచించారు. ప్రైవేట్ వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.
వాహనాలు నడిపే ప్రతిఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీ గా ఉండే సమయాల్లో ప్రజలు సంయమనం పాటించి నిబంధనలకు అనుగుణంగా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ మోటార్ సైకిళ్ళు నడపడం ఎంతో ప్రమాదమని సూచించారు. పట్టణంలో ఎక్కువగా త్రిబుల్ రైడింగ్ చేస్తున్నారని ఇది చట్టవిరుద్ధం అన్నారు. అలాగే మైనర్ విద్యార్థులకు తల్లిదండ్రులకు వాహనాలు ఇవ్వకూడదన్నారు. తద్వారా జరిగే పరిణామాలను వివరించారు.
మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతు న్నారని అలాంటి వారు పట్టుబడితే జరిమానాలు తప్పవన్నారు. వాహనాలు వేగంగా వెళ్లడం వల్ల వారి ప్రాణాలతో పాటు ఇతర వాహనదారులకు కూడా నష్టం కలిగించే రీతిలో ప్రవర్తించడం ఎటువంటి పరిస్థితుల్లోనూ తగదని సూచించారు . ట్రాఫిక్ నిబంధనలపై పాఠశాలల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ అంజలి ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.