ఖమ్మం: ఫుట్ పాత్ల ఆక్రమణల కారణంగా రోడ్లపై పాదచారులకు, ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న క్రమంలో ఆయా వ్యాపారాలను స్వచ్చందంగా తొలగించాలని ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్ చిరు వ్యాపారులకు సూచించారు. ఎన్టీఆర్ సరిల్ వద్ద తరుచుగా జరుగుతున్న ప్రమాదాల నివారణకు ఆర్ఎండ్బీ డిఈ సూరిబాబుతో కలసి శుక్రవారం సందర్శించారు. సర్కిల్ వద్ద ప్రమాదాలు నియంత్రించేందుకు నేషనల్ హైవే అధికారులతో చర్చించి చర్యలు తీసుకోనున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు.
అనంతరం నగరంలోని పాత బస్ స్టాండు, కమన్ బజార్, బొమ్మన సెంటర్, కస్బాబజార్లో ఉన్న ఫుట్ పాత్లపై చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్నవారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రోడ్లపై వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న క్రమంలో పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ల ఆక్రమణల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వారికి అర్ధమయ్యే విధంగా ట్రాఫిక్ ఏసీపీ వివరించారు.
పాదచారులు నడవడానికి ఏర్పాటు చేసిన ఫుట్ పాత్పై చేస్తున్న వ్యాపారాలను స్వచ్చందంగా తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా తమతో సహకరించాలని కోరారు. పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలను తీసుకుంటున్నామని ఏసీపీ తెలిపారు. ఫుట్ పాత్లను ఖాళీ చేసి మరో చోట వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించారు.
ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించకపోతే జరిమానాలు తప్పవని, ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించి ప్రజలు, వాహన దారులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాము తీసుకుంటున్న చర్యలకు చిరు వ్యాపారులు సైతం సహకరించాలని ట్రాఫిక్ ఏసీపీ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐలు అంజలి, సురేష్ పాల్గొన్నారు.