ఖమ్మం :అనైతిక దత్తతతో మునుముందు అనేక సమస్యలు వస్తాయని, దత్తత ప్రక్రియ చట్ట ప్రకారం జరగాలని జిల్లా సంక్షేమ అధికారిణి(డీడబ్యూఓ)సీహెచ్ సంధ్యారాణీ తెలిపారు. గురువారం నగరంలోని బాలల సదనంలో దత్తత మాసోత్సవం కార్యక్రమం జరిగింది. పిల్లల దత్తతకు దరఖాస్తులు చేసుకున్న తల్లితండ్రులకు దత్తతపై అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంధ్యారాణి వారిని ఉద్దేశించి మాట్లాడారు. పిల్లలను దత్తత ఇచ్చేందుకు స్త్రీ శిశు సంక్షేమశాఖ సిద్దంగా ఉందన్నారు.
అయితే పద్దతి ప్రకారం దత్తత తీసుకోవాల్సి ఉంటుందని, కావాల్సిన ధృవపత్రాలతో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులు అందిన వెంటనే సదరు దరఖాస్తుదారుల పూర్వపరాలు నిశితంగా పరిశీలన చేయడం జరుగుతుందన్నారు. అనంతరం సీనియారిటి ప్రకారంగా పిల్లలను దత్తత ఇవ్వడం జరుగుతుందన్నారు.
చట్ట ప్రకారం దత్తత తీసుకున్న పిల్లలకు న్యాయస్థానం ద్వారా ఆమోదం ఉండటంతో పాటు, పుట్టిన తేదీ ధృవపత్రం అందించడం జరుగుతుందన్నారు. పిల్లలు లేని తల్లితండ్రులు పిల్లల దత్తత కోసం తమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బాలల రక్షణ అధికారి టీ విష్ణువందన, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.