ఖమ్మం, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అడవులను రక్షించే అధికారులకు ఆయుధాలను అందించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని, అడవులకు రక్షణ కవచంగా ఉండే అటవీ ఉద్యోగులపై జరిగే దాడులను ఇక ఏమాత్రమూ సహించబోమని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఉండి గొత్తి కోయల దాడిలో మరణించిన ఫారెస్ట్ రేంజ్ అధికారి చలమల శ్రీనివాసరావు అంత్యక్రియల్లో పాల్గొందుకు వచ్చిన ఆయన.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్తో కలిసి మృతుడి గ్రామమైన ఖమ్మం జిల్లా ఈర్లపూడిలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చిన గొత్తి కోయల్లో కొందరు ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. రేంజ్ అధికారిని హత్య చేయాల్సిన అవసరం వారికి ఏమొచ్చిందో వారిని ఎవరు ప్రేరేపిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. పోడు భూముల అంశంపై ప్రభుత్వం ఇప్పటికే క్షేత్రస్థాయిలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, సమగ్ర సర్వే అనంతరం అర్హులందరికీ హక్కు పత్రాలు కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని అన్నారు. ఇదే సమయంలోనే మరోవైపు ఈ తరహా చర్యలకు పాల్పడడం దారుణమని అన్నారు. శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియాతోపాటు ఆయన కుటుంబం కోరుకున్న చోట 500 గజాల ఇంటి స్థలం, కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం తక్షణమే ఇస్తామని అన్నారు. అలాగే శ్రీనివాసరావుకు వచ్చే వేతనాన్ని ఆయన ఉద్యోగ విరమణ సమయం వచ్చే వరకు అతడి కుటుంబానికి అందించాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిపారు.
అధికారులను నరుకుతామంటే చూస్తూ ఊరుకోం..
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చిన గొత్తి కోయలు అడవులను నరుకుతున్నట్లుగా.. వాటిని కాపాడే అధికారులనూ నరుకుతామంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. పోడుభూముల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న సమయంలో గొత్తి కోయలు అటవీ అధికారిని హతమార్చడం దిగ్భ్రాంతిని కలిగిస్తున్నదని అన్నారు. తెలంగాణలో ఉన్న గిరిజనులతో ఎప్పుడూ ఈ తరహా సమస్య తలెత్తలేదని గుర్తుచేశారు. అటవీ అధికారులను అడ్డుకుంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.
అడవులను రక్షించడంలో నిబద్ధత కలిగిన వ్యక్తి ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు అని అన్నారు. వనాలను రక్షిస్తున్నందుకుగాను ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఫారెస్ట్ శాంతకుమారి, సౌమ్య నుంచి అతడు గోల్డ్ మెడల్ కూడా అందుకున్నట్లు మంత్రి గుర్తుచేశారు. అటువంటి అధికారిని దారుణంగా హత్య చేయడం తనను కలిచి వేస్తున్నదని అన్నారు. అడవులను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఫారెస్ట్ అధికారులు తమ వద్ద ఆయుధాలు లేకున్నా ప్రాణాలకు తెగించి మరీ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక గిరిజనులతో ప్రభుత్వానికి ఎలాంటి సమస్యా లేదని, పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు హక్కులను కల్పించాలని చర్యలు చేపడుతున్నదని వివరించారు. శాశ్వత పరిష్కారం కోసం 11 లక్షల ఎకరాలకు హక్కు పట్టాలు అందించేందుకు సర్వేలు చేపడుతున్నట్లు చెప్పారు.
అవార్డులు పొందిన అధికారి అతడు..
నిబద్ధతతో పనిచేసే ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు అని, ఉత్తమ సేవలతో అనేక అవార్డులు అందుకున్నారని అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారి గుర్తుచేశారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ అధికారి డోబ్రియల్ మాట్లాడుతూ.. ఎఫ్ఆర్వో హత్యను ఖండిస్తున్నామని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిస్తామని అన్నారు.