ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ గర్భిణులు, బాలింతల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పీహెచ్సీలు, ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకోవడానికి.. ప్రసవం జరిగిన తర్వాత తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటికి చేర్చడానికి తెలంగాణ ప్రభుత్వం అమ్మ ఒడి వాహనాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చింది. 102కి కాల్ చేసిందే తడవుగా సదరు గర్భిణి ఇంటి ముందు వాహనం వాలిపోతుంది. ఆమెకు తోడుగా ఆశ కార్యకర్త ఉండే విధంగా సేవలను విస్తృతం చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అమ్మ ఒడి వాహనాలు ఈనెల 1వ తేదీ నుంచి 24 గంటలపాటు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నాయి. ఇప్పటికే పీహెచ్సీలను అప్గ్రేడ్ చేసి.. ఆస్పత్రుల బెడ్లు స్థాయిని పెంచిన సీఎం కేసీఆర్ సర్కారు ఆస్పత్రుల్లోనే అన్ని జబ్బులకు ఉచితంగా పరీక్షలు చేసే విధంగా యంత్రాలను సైతం సమకూర్చారు. -భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : కడుపు పండిందంటే ఆ ఇంటి ఇల్లాలు పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లాలి. పరీక్షలు చేయించుకొని వైద్యుల సూచన మేరకు పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు బిడ్డ ఆరోగ్యం కోసం మందులు, ఇంజక్షన్లు తీసుకోవడం కోసం ఆస్పత్రికి వస్తుండాలి. ఈ క్రమంలో గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అమ్మ ఒడి వాహనాలను సమకూర్చారు. గతంలో గర్భిణులు, బాలింతలు ఆస్పత్రికి వెళ్లాలంటే ఆటో లేదా రిక్షా లేదా అందుబాటులో ఉన్న వాహనంలో వెళ్లాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వ హయాంలో గర్భిణులను ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు అమ్మ ఒడి వాహనాలు సేవలు అందిస్తున్నాయి. 2018లో కేవలం 7 వాహనాలకే పరిమితమైన అమ్మ ఒడి సేవలు మరింత విస్తృతమయ్యాయి. గ్రామస్థాయి నుంచి పట్టణస్థాయి ఆస్పత్రులకు చేరుకున్నాయి. 102కి ఫోన్ చేస్తే చాలు ఇంటి ముందుకు వాహనం వచ్చి ఆగడంతోపాటు ఆశ వర్కర్ కూడా ప్రత్యక్షమవుతుంది. ఇలాంటి సేవలు అందించాలంటే అది తెలంగాణ సర్కార్కు మాత్రమే సాధ్యమని ప్రతి పథకం అమలులో రుజువు చేస్తున్నది.
2018లో ప్రారంభమైన అమ్మ ఒడి ఐదేళ్లుగా సేవలు అందిస్తున్నది. ఇప్పటి వరకు 3 లక్షల మందికి పైగా గర్భిణులు, తల్లులను ఆస్పత్రికి తరలించి సేవలు అందించారు. ప్రారంభంలో జిల్లాలో 7 వాహనాలు అందుబాటులో ఉన్నా పెరుగుతున్న సేవలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 12 వాహనాలను కొత్తగా మంజూరు చేసింది. దీంతో మొత్తం 19 వాహనాలు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఆయా ఆస్పత్రుల పరిధిలో సేవలు అందిస్తున్నాయి. మారుమూల గ్రామాల నుంచి సైతం 102కి కాల్ చేస్తే క్షణాల్లో అక్కడికి ప్రత్యక్షమైన వాహనం వెంటనే వారిని ఆస్పత్రులకు చేరుస్తున్నాయి. ప్రధానంగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రామవరంలో ఉన్న ఎంసీహెచ్కి మూడు వాహనాలను కేటాయించడం వల్ల ఎక్కువ మంది అక్కడ సేవలు పొందుతున్నారు. రోజూ 50 మందికి పైగా కాన్పులు చేసుకోవడం వల్ల అక్కడ అమ్మ ఒడి వాహనాలు రద్దీ బాగా పెరిగింది.
కొత్తగా 24 గంటలు విధుల్లో అమ్మ ఒడి
ఇదివరకు అమ్మ ఒడి వాహనాలు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేసేవి. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో గర్భిణులకు అత్యవసర చికిత్సలు అవసరం ఉన్నందున వారి సమస్యలను గుర్తించి 24 గంటలపాటు వాహనాలు అందుబాటులో ఉండేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి అమ్మ ఒడి సేవలు 24 గంటలపాటు అందుబాటులో ఉంటున్నాయి. అర్ధరాత్రి ఏ సమయంలో 102కి కాల్ చేసినా ఇంటి ముందు అమ్మ ఒడి వాహనం ప్రత్యక్షమవుతుంది. జిల్లాలో ఉన్న ఏరియా ఆస్పత్రి జిల్లా ఆస్పత్రిగా అప్గ్రేడ్ కావడంతోపాటు ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించడం వల్ల మహిళలకు సేవలు మరింతగా దగ్గరయ్యాయి. దీంతోపాటు టిపా స్కానింగ్, ఎక్స్రేలు, మోమోగ్రాం, టుడీకో పరికరాలు అందుబాటులో ఉండడం వల్ల గర్భిణులకు సేవల అవసరం బాగా పెరిగింది. దీంతో అమ్మ ఒడి సేవలు మరింత చేరువయ్యాయి.
సమస్య ఎలాంటిదైనా ఆస్పత్రికి వెళ్లాలంటే 102కి కాల్ చేస్తే చాలు ఇంటి ముందుకొచ్చి వాహనం ఉంటుంది. ఆశ వర్కర్ కూడా వాహనంలో వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆటోలో వెళ్లాలంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయోననే భయం. అమ్మ ఒడి వాహనం సౌకర్యవంతంగా ఉంది. పేదలకు మరింత ఉపయోగకరం. ప్రతి పరీక్షకు ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆస్పత్రిలో సేవలు అందుకోవాలి. అందువల్ల అమ్మ ఒడి తల్లీబిడ్డలకు తల్లి ఒడి లాంటిది. -ప్రవళిక, కూలీలైన్, కొత్తగూడెం
మొన్నటి వరకు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు షిప్టు డ్యూటీలు ఉండేవి. ఇప్పుడు అమ్మ ఒడి వాహనం ఎప్పుడు కాల్ చేసినా అందుబాటులో ఉంటుంది. 24 గంటలు పని చేయాల్సిందే. జిల్లాలో 19 కొత్త వాహనాలను ఇచ్చారు. 108 కూడా మరో రెండు కొత్త వాహనాలు జిల్లాకు ఇచ్చారు. గర్భిణులు మొత్తంగా 14 సార్లు ఆస్పత్రికి సేవల కోసం వెళ్తున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత 3 నెలల వరకు సేవలు పొందుతున్నారు.
-భామా నాగేందర్, 102 ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్