అశ్వారావుపేట, సెప్టెంబర్ 28 : ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. గర్భిణులు, చిన్నారులకు అందించే వ్యాక్సిన్ల లక్ష్యాన్ని నూరుశాతం చేరుకునేందుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం వారి వివరాలు నమోదు చేసేందుకు యూ-విన్ పోర్టర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టీకా నమోదు తేదీని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించేలా ఈ పోర్టల్ పనిచేస్తుంది. కోవిడ్ తరహాలోనే యూ-విన్ పోర్టల్ వ్యాధి నిరోధక టీకాలు నమోదు లక్ష్యాన్ని పూర్తి చేస్తుంది. టీకా లబ్ధిదారులు ఎక్కడి నుంచైనా వ్యాక్సిన్ తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఇప్పటి వరకు గర్భిణులు, చిన్నారులు వ్యాక్సిన్ కోసం సమీప ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఇక ఈ ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా వ్యాధి నిరోధక టీకాల పంపిణీని పూర్తిగా డిజిటలైజేషన్ చేస్తూ యూ-విన్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ యాప్ ద్వారా టీకా లబ్ధిదారులు వ్యాక్సిన్ ఏ రోజు తీసుకోవాలో ఫోన్కు ముందే సమాచారం అందుతుంది. ఈ యాప్ ద్వారా ప్రతి గ్రామంలోనూ గర్భిణులు, చిన్నారులకు వంద శాతం వ్యాక్సినేషన్ అందించవచ్చని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు.
వ్యాక్సినేషన్ నమోదు ఇలా..
గ్రామాల వారీగా గర్భిణులు, చిన్నారుల వివరాలను డిజిటలైజేషన్ చేస్తారు. వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం టీకా అందించేలా కుటుంబ సభ్యులకు ఈ పోర్టల్ ద్వారా ముందుగానే మెసేజ్ పంపుతారు. టీకా లబ్ధిదారులు వ్యాక్సిన్ సమయాన్ని మర్చిపోయినా ఫోన్కు వచ్చే సందేశంతో నిర్ణీత గడువులోగా టీకా పొందొచ్చు. డిజిటలైజేషన్ ద్వారా దేశంలో ఎక్కడ నుంచైనా సమీపంలో ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో టీకా వేయించుకోవచ్చు. టీకా తీసుకున్న తర్వాత ఈ పోర్టల్ ద్వారా సర్టిఫికెట్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
12 రకాల టీకాలు..
గర్భిణులు, ఐదేళ్ల లోపు చిన్నారులకు ప్రభుత్వం ఇప్పటి వరకూ అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 12 రకాల వ్యాధి నిరోధక టీకాలను ఉచితంగా అందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమంలో భాగంగా తాజాగా టీకాల నమోదును డిజిటలైజేషన్ చేసింది. టీకా వేసిన తర్వాత వారి వివరాలను యూ-విన్ పోర్టల్లో డిజిటలైజేషన్ చేస్తారు. లబ్ధిదారులు వ్యాక్సినేషన్ కోసం తమ ఆండ్రాయిడ్ ఫోన్లో యూ-విన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేసుకోవచ్చు. జిల్లాలో హైరిస్క్ ఏరియాలు, ఇటుక బట్టీలు, సంచార జాతుల గుడిసెల వద్ద వ్యాధి నిరోధక టీకాలు కచ్చితంగా వేయాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నూరు శాతం నమోదు లక్ష్యం..
గర్భిణులు, చిన్నారులకు నూరు శాతం వ్యాధి నిరోధక టీకాలు వేసేందుకు చేసేందుకు ప్రభుత్వం డిజిటలైజేషన్ ప్రక్రియను చేపట్టింది. ముందుగా ఈ పోర్టల్లో గ్రామాల వారీగా లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తాం. ఏ సమయంలో ఏ తేదీన టీకా నమోదు చేసుకోవాలో ఫోన్కు ముందుగానే సమాచారం వెళ్తుంది. కోవిడ్ పోర్టల్ మాదిరిగానే యూ-విన్ యాప్ పని చేస్తుంది. ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్కడి నుంచైనా సమీప ఆరోగ్య కేంద్రాల్లో లబ్ధిదారులు టీకా నమోదు చేసుకోవచ్చు. అంతేకాదు.. టీకా నమోదు చేసుకున్నట్లు సర్టిఫికెట్ను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఆరోగ్య తెలంగాణ నిర్మాణం లక్ష్యంగా నూరు శాతం వ్యాక్సినేషన్కు ఈ పోర్టల్ పూర్తిగా దోహదపడుతుంది.
-డాక్టర్ బీ.రాందాస్, ప్రభుత్వ వైద్యుడు, అశ్వారావుపేట