భధ్రాచలం, ఫిబ్రవరి 26 : స్వస్తిశ్రీ చాంద్రమాన శుభకృత్ నామ సంవత్సర చైత్ర శుద్ద పాడ్యమి బుధవారం నుంచి చైత్ర శుద్ద చతుర్దశి బుధవారం వరకు(మార్చి 22 నుంచి ఏప్రిల్ 5) భద్రాద్రి రామాలయంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దీనిలో భాగంగా మార్చి 30వ తేదీన శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం జరుగనున్నదని ఆలయ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 31వ తేదీన 12సంవత్సరాలకొకసారి నిర్వహించే శ్రీ స్వామివారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
ఆలయం, కల్యాణ మంటపం, పరిసర ప్రాంతాల్లో విద్యుద్దీకరణ ఏర్పాటు కోసం రూ.18 లక్షలు, రుత్వికులకు బహుకరించేందుకు రుత్విక్ సంభావనలు రూ.10 లక్షలు, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం హోమాలు, యాగాలు చేసే వేద పారాయణదారులకు భోజన వసతి కోసం రూ.10 లక్షలు, శ్రీ స్వామివారి అమ్మవార్లకు పట్టు వస్ర్తాల సమర్పణ రూ.8 లక్షలు, ఆలయం, కల్యాణ మంటపంలో పూల అలంకరణ కోసం రూ.8 లక్షలు, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం సందర్భంగా యాగశాల ఏర్పాటుకు రూ.5 లక్షలు ఖర్చు చేయనున్నారు. శ్రీరామనవమి, పట్టాభిషేకం రెండ్రోజులు భక్తులకు అన్నప్రసాద వితరణ కోసం రూ.5 లక్షలు, చలువపందిళ్ల ఏర్పాటు కోసం రూ.4 లక్షలు, ప్రధాన కూడళ్లలో ైప్లెవుడ్ ఆర్చిగేట్లు రూ.4 లక్షలు, 10రోజులపాటు హోమద్రవ్యాలు కోసం రూ.3 లక్షలు, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం కోసం 12 నదీజలాల సేకరణకు ఒక్కొక్క నదీజల సేకరణ నిమిత్తం రూ.12 వేలు చొప్పున రూ.1.44 లక్షల వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
రామయ్యకు స్వర్ణపుష్పార్చన
భద్రాచలం, ఫిబ్రవరి 26: సీతారామచంద్రస్వామి వారి దివ్య క్షేత్రంలో ఆదివారం అంతరాయంలోని మూలవరులకు 108 స్వర్ణ పుష్పాలతో అర్చకులు అర్చన నిర్వహించారు. తొలుత అంతరాలయంలో అభిషేకం నిర్వహించారు. తెల్లవారు జామున స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, ఆరగింపు, సేవాకాలం, నిత్య బలిహరణం, నిత్య హోమాలు, నిత్య పూజలు జరిపారు. అనంతరం నిత్య కల్యాణమూర్తులను బేడ మండపానికి మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో తీసుకొచ్చారు. తొలుత విశ్వక్సేన ఆరాధన, కర్మణా పుణ్యావచన జరిపి స్వామివారికి కంకణ ధారణ, యజ్ఞపవీత ధారణ, శాస్ర్తోక్తంగా నిత్యకల్యాణం నిర్వహించారు. కల్యాణంలో పాల్గొన్న దాతలకు స్వామివారి ప్రసాదాలు, శేషవస్ర్తాలను అందజేశారు.