భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ఖమ్మం సిటీ, డిసెంబర్ 9: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పేదలకు వరం లాంటిదని ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక అన్నారు. ఈ పథకం కింద ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల పరిమితి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచగా.. ఆ పెంపు అమలు కార్యక్రమాన్ని శనివారం ఆయా జిల్లా కేంద్రాల్లో వారు ప్రారంభించారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 1383 రోగాలకు చికిత్సలు, సర్జరీలు, 289 వైద్య రుగ్మతలకు వరిస్తుందని అన్నారు. అనంతరం ఈ పథకం పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. అధికారులు మాలతి, రాజేశ్వరరావు, విద్యాచందన, సుమ, మాధవరావు, కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెంలో..
కొత్తగూడెంలోని రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు శనివారం నుంచి అమలులోకి వచ్చిందని అన్నారు. భద్రాద్రి జిల్లాలో 9 ప్రభుత్వ, 4 ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ పథకం కింద సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కంచర్ల చంద్రశేఖర్రావు, సీతాలక్ష్మి, డాక్టర్ శిరీష, డాక్టర్ కుమారస్వామి, భవానీ ప్రసాద్, వీవీ రావు, జమలయ్య, మోరె రూప తదితరులు పాల్గొన్నారు.