భద్రాద్రి కొత్తగూడెం, మే 29 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో ఎస్పీ రోహిత్రాజుతో కలిసి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. జూన్ 9వ తేదీన జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షల కోసం జిల్లావ్యాప్తంగా 21 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేయగా 8,875 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారన్నారు. పరీక్షాకేంద్రాల్లో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్ష జరిగే రోజు ఉదయం తగిన భద్రత మధ్య ఓఎంఆర్ షీట్లు, ప్రశ్నాపత్రాలను తరలించాలని, అభ్యర్థులు ఎటువంటి గందరగోళానికి గురికాకుండా ఒక ప్రధాన గేటు ద్వారానే పరీక్షా కేం ద్రంలోకి అనుమతించాలన్నారు. పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే పరీక్షా కేంద్రంలోనికి అనుమతించాలని కోరారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష ఉంటుందని చెప్పారు. సీసీ కెమెరాలు అమర్చాలని సూచించారు. సెల్ఫోన్లు, ఎలక్ట్రికల్ వస్తువులు ఏవీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించమన్నారు. కార్యక్రమంలో డీఆర్వో రవీంద్రనాథ్, టీజీపీఎస్సీ రీజినల్ కో ఆర్డినేటర్ జగన్మోహన్రాజు, డీఎస్పీ రెహమాన్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ తిరుమలచారి, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఫ్లయింగ్ స్పాట్ బృందాలు, రూట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.