కూసుమంచి, మే 13 : కూసుమంచికి మరో పురాతన కట్టడం వన్నె తెస్తున్నది. కోటలో ఉన్న కాకతీయుల కట్టడమైన మరో కళాశిల్పం చూపరులను కట్టిపడేస్తున్నది. వెయ్యేండ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ నిర్మాణం దుర్గామాత, కాళికామాత ఆలయంగా చెబుతున్నప్పటికీ స్పష్టమైన ఆనవాళ్లు మాత్రం లేవు. కూసుమంచి శివాలయం ఇక్కడ ప్రసిద్ధిగాంచిన విషయం విదితమే. శివాలయం పక్కన గల ముక్కంటేశ్వరాలయం మాదిరిగా ఉన్న ఈ ఆలయం చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తున్నది.
వెలుగులోకి పురాతన ఆలయం..
ఎన్నో ఏళ్లనాటి చరిత్ర గల కూసుమంచి కోటలో నూతనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించేందుకు గ్రామస్తులు ఇటీవల నిర్ణయించారు. దీనిలో భాగంగా ఇప్పుడు ఉన్న ఆలయం వెనుక భాగంలో స్థలాన్ని రామసహాయం రఘురాంరెడ్డి వితరణ ఇచ్చారు. ఆ స్థలాన్ని శుభ్రం చేస్తుండగా చెట్ల పొదల మధ్య శిథిలావస్థకు చేరిన ఈ ఆలయం చుట్టూ ఉన్న చెట్లను కూడా తొలగించారు. దీంతో పురాతన గుడి వెలుగులోకి రావడంతో చూడడానికి అనేక మంది వస్తున్నారు.
కాకతీయుల కళాశిల్పం
గ్రామంలోని ముక్కంటేశ్వరాలయం మాదిరిగా ఉన్న ఈ ఆలయ గర్భగుడి ఎదుట హాల్ రాళ్ల నిర్మాణంతో చేసి ఉంది. ద్వార పాలకులు ఇరువైపులా గదతో ప్రధాన ద్వారానికి అటుఇటు దర్శనమిస్తున్నారు. గర్భగుడి ముందు మండపంలాగా గుండ్రని నిర్మాణం పగిలిపోయి ఉంది. డిజైన్లతో పిల్లర్లు మాదిరిగా భవన నిర్మాణం పెద్దపెద్ద బండరాళ్లతో నిర్మించారు. ఈ గుడి చరిత్ర స్పష్టంగా తెలియనప్పటికీ కనకదుర్గ అమ్మవారి గుడిగా పూర్వీకులు చెబుతున్నారు. గత సంవత్సరం పురావస్తుశాఖ వారు ఆలయాన్ని సందర్శించారు.
మా తాతల నాటినుంచి ఉంది..
కోటలో ఈ పురాతన గుడి మా తాతల నాటినుంచి ఉంది. అందులో ఏ దేవుడు ఉండేవాడో తెలియదు. కోట బురజు ఉండేది, పెద్దపెద్ద గుమ్మాలు కూడా ఉండేవి. చుట్టూ ఉన్న స్థలాల్లో ఇండ్లు కట్టుకోవడంతో గుడి కనుమరుగు అయ్యింది. దుర్గామాత గుడి అంటుంటే విన్నాను. శిథిలావస్థలో ఉన్నప్పటికీ వన్నె తగ్గలేదు.
– గుడ్ల కోటయ్య, కూసుమంచి
ఇప్పుడా ఆ గుడి కట్టలేం..
ఇప్పుడు కట్టే గుడులు సిమెంట్తో కడుతున్నారు. అలాంటి గుడి ఇప్పుడు కట్టలేరు. మా చిన్నతనం నుంచే కూసుమంచి కోటలో గుడి ఉంది. కానీ దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆలయాన్ని తిరిగి పునఃనిర్మాణం చేస్తే బాగుంటుంది. రామాలయ నిర్మాణం పూర్తయితే.. పక్కనే ఉండడంతో ఈ గుడికి కూడా ప్రత్యేకత లభించనున్నది.
– మక్కపల్లి శేషయ్య, కూసుమంచి