ఖమ్మం : సీఎం కేసీఆర్ మనసున్న మారాజు అని, అడిగిన వెంటనే గ్రానైట్ పరిశ్రమను ఆదుకుని జీవం పోశారని తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) అన్నారు. గ్రానైట్ పరిశ్రమ కు పాత పద్దతిలో స్లాబ్ విధానం, 40 శాతం రాయితీ కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ఖమ్మం జిల్లా గ్రానైట్, స్లాబ్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ స్వాగతించింది. మంగళవారం ముదిగొండ పారిశ్రామిక వాడలో అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి గ్రానైట్ యజమానులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో గాయత్రి రవితో పాటు అసోసియేషన్ నాయకులు పారా నాగేశ్వరరావు, ఉప్పల వెంకటరమణ, తమ్మినేని వెంకట్రావు, తుళ్లూరు కోటేశ్వరరావు, సాదు రమేష్ రెడ్డి తదితరులు మాట్లాడారు.
కోవిడ్ తో గ్రానైట్ పరిశ్రమ కుదేలైందని.. కొనుగోలు దారు లేక.. ఎగుమతులు నిలిచిపోయి.. రోడ్డున పడే స్థితికి వచ్చిందన్నారు. ఈ పరిస్థితుల్లో టన్నేజి విధానం అమలు చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇది గ్రానైట్ పరిశ్రమకు విలువైన ఉపశమనం అని అభిప్రాయపడ్డారు. మంత్రులు కేటీఆర్,హరీష్ రావు ల సహకారం వల్లే పరిశ్రమకు మేలు జరిగిందని అన్నారు. దీని వల్ల గ్రానైట్ మీద ఆధారపడ్డ ఖమ్మం,వరంగల్,కరీంనగర్ జిల్లాల్లోని లక్షలాది కుటుంబాలకు మేలు జరుగిందని ఆనందం వ్యక్తం చేశారు.
గ్రానైట్ పరిశ్రమలో ఇంకా మిగిలి ఉన్న సమస్యలను కూడా సీఎం కేసీఆర్ కు విన్నవించి పరిష్కరించుకుంటామని చెప్పారు. 40 శాతం రాయితీ,స్లాబ్ సిస్టం కొనసాగింపు నిర్ణయం అమలుకు సహకరించిన మంత్రులు పువ్వాడ,ఎర్రబెల్లి,గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్,ఎంపీ నామా, ఎమ్మల్యే సండ్ర వెంకట వీరయ్య,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు వారు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. తమ కష్టాలు తీర్చిన ముఖ్యమంత్రికి రాష్ట్రం వ్యాప్తంగా అభినందన సభలు నిర్వహిస్తాం అని నాయకులు ప్రకటించారు.