పదో తరగతిలో నిరుటికంటే మెరుగైన ఫలితాలు సాధించేలా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. నిరుడు 95 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ విద్యా సంవత్సరంలోనూ నూరుశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఏఎస్డబ్ల్యూవోలు, హెచ్డబ్ల్యూవోలు చర్యలు తీసుకుంటున్నారు. టెన్త్లో ఎస్సీ వసతిగృహాల్లో నిరుడు 129 మంది విద్యార్థులకు గాను 124 మంది ఉత్తీర్ణులై జిల్లాలో 95 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు.
-కొత్తగూడెం ఎడ్యుకేషన్, జనవరి 4
కొత్తగూడెం ఎడ్యుకేషన్, జనవరి 4: పదో తరగతి ఫలితాల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోంది. నిరుడు 95 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇదే జోష్తో ఈ విద్యాసంవత్సరంలోనూ నూరుశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఏఎస్డబ్ల్యూవోలు, హెచ్డబ్ల్యూవోలు చర్యలు తీసుకుంటున్నారు. నిరుడు సాధించిన ఉత్తీర్ణతను, గతంలో జరిగిన పొరపాట్లను అధిగమిస్తూ ఈసారి మరింత పటిష్టంగా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు మరింతగా అర్థమయ్యే రీతిలోబోధనా విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రత్యేక ట్యూటర్లకు తర్ఫీదు ఇస్తున్నారు. నాణ్యమైన భోజనంతోపాటు మెరుగైన విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వసతి గృహాల్లో అన్ని చర్యలూ చేపడుతోంది.
నిరుడు 95 శాతం ఉత్తీర్ణత..
నిరుటికంటే మెరుగైన ఫలితాలు సాధించే లక్ష్యంతో ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు ముందుకుసాగుతున్నారు. టెన్త్లో ఎస్సీ వసతిగృహాల్లో నిరుడు 129 మంది విద్యార్థులకు గాను 124 మంది ఉత్తీర్ణులై జిల్లాలో 95 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. కలెక్టర్ ద్వారా పలువురు విద్యార్థులకు నగదు బహుమతిని కూడా పారితోషికంగా అందించారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా అన్ని వసతిగృహాల నుంచి పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఏఎస్డబ్ల్యూవోలు, హెచ్డబ్ల్యూవోలకు ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి ఆదేశాలు జారీ చేశారు.
కొత్తగూడెం డివిజన్ నుంచి బాలుర వసతిగృహంలో 22 మంది, బాలికల వసతిగృహంలో 23 మంది, ఇల్లెందు బాలుర వసతిగృహంలో 13 మంది, జూలూరుపాడు బాలుర వసతిగృహంలో 19 మంది, చండ్రుగొండ బాలుర వసతిగృహంలో 24 మంది కలిపి మొత్తం 101 మంది, పాల్వంచ డివిజన్లోని బూర్గంపహాడ్, పాల్వంచ బాలుర వసతిగృహాల్లో 25 మంది, పాల్వంచ బాలికల వసతిగృహంలో 33 మంది, భద్రాచలం డివిజన్లోని భద్రాచలం, మణుగూరు బాలికల వసతిగృహాల్లో 68 మంది, చర్ల బాలికల వసతిగృహంలో 19 మంది ఉన్నారు. మొత్తం 246 మంది విద్యార్థులు ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు.
ప్రత్యేక వసతులు..
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతిగృహాల్లోనూ మెరుగైన వసతులు కల్పిస్తోంది. యో గా, మోటివేషన్ తరగతులూ నిర్వహిస్తోంది. ఆల్ ఇన్ వన్ గైడ్స్, కంపాక్స్ బాక్సులు, స్కేళ్లు, పెన్సిళ్లు, పెన్నులు తదితర పరీక్ష సామగ్రిని కూడా అందిస్తోంది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక స్నాక్స్ను మెనూలో అందిస్తున్నారు. విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు వార్డెన్లే దగ్గరుండి మరీ ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్తారు. టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులకు హాస్టల్లో ప్రత్యేక గదులు ఏర్పాటు చేయడంతోపాటు చలికాలం దృష్ట్యా వేడినీటిని అందిస్తున్నారు. వసతిగృహాల్లో ఫ్రెండ్లీ బోధనతో విద్యార్థుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తున్నారు.
ప్రతి హాస్టల్కూ నలుగురు ట్యూటర్లు..
టెన్త్లో నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఎస్సీ వసతిగృ హాల్లో ప్రత్యేక ట్యూటర్లను నియమించి మెరుగైన బోధన అందిస్తున్నారు. హిందీ, ఇంగ్లిష్, గణితం, సైన్స్ బోధించే ట్యూటర్లకు నెలకు రూ.1500 పారితోషికాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. ఉదయం 5 గంటలకే ప్రత్యేక స్టడీ అవర్స్ను మొదలుపెడుతున్నారు. మళ్లీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. ఈ స్టడీ అవర్స్లో విద్యార్థులకు స్నాక్స్, చాయ్, బిస్కెట్స్, పల్లీ చెక్కతోపాటు మంచి పౌష్టికాహారం అందిస్తున్నారు.
ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం..
టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. నిరుటి ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది మరింత మెరుగైన ఫలితాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. చలికాలంలో విద్యార్థులకు అవసరమైన స్వెట్టర్లను పంపిణీ చేశాం. స్టడీ మెటీరియల్ను అందిస్తున్నాం.
-అనసూర్య, డీఎస్సీడీవో, భద్రాద్రి కొత్తగూడెం