కరకగూడెం, ఏప్రిల్ 27: ఏజెన్సీలోని దట్టమైన మన్యంలో లభించే విప్పపూలు ఆదివాసీలకు కల్పతరువు లాంటివి. వీటిలోని సహజసిద్ధ ఔషధ గుణాలు.. ప్రతి ఒక్కరి సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీంతో చాలామంది దీని ఉత్పత్తులను విరివిగా వినియోగిస్తారు. అయితే ఇందుకోసం జరిగే విప్పపూల సేకరణ ఆదివాసీలకు చక్కని ఆదాయాన్ని సమకూర్చుతుంది. ఏటా ఏప్రిల్, మే నెలల్లో ఏజెన్సీ అడవుల్లో విప్పపూలు విస్తారంగా పూస్తాయి. దీంతో ఆయా నెలల్లో ఆదివాసీలు ఇంటిల్లిపాదీ కలిసి అడవుల్లోకి వెళ్లి వాటిని సేకరించుకొని తెస్తారు. తగిన మోతాదులో ఎండబెట్టిన తరువాత వాటిని జీసీసీ కేంద్రాల్లో విక్రయించి మంచి ఆదాయం పొందుతారు. కరకగూడెం మండలం రఘునాథపాలెం, చొప్పాల, కొత్తగూడెం, రేగళ్ల, ముత్తారం, కన్నాయిగూడెం, కోరంవారిగుం పు, చిరుమళ్ల, అనంతారం, శ్రీరంగాపురం, మొగిలితోగుతోపాటు మరికొన్ని గ్రామాల్లో విప్పపూల సేకరణ ఇప్పటికే ప్రారంభమైంది.
విప్పపూలతో సంపూర్ణ ఆరోగ్యం
సంపూర్ణ ఆరోగ్యానికి విప్పపూలు ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎండిన విప్పపూలను వెచ్చగా చేసి నూనె తయారు చేసి తల వెంట్రుకల కుదుళ్లకు పట్టిస్తే చుండ్రు సమస్యే ఉండదని చెబుతున్నారు. అలాగే విప్పపూల బెరడును మెత్తగా దంచి దాని నుంచి రసం తీసి 5 మి.లీ చొప్పున తాగితే వాతం, నొప్పులు, రక్తహీనత వంటివి తగ్గిపోతాయని అంటున్నారు. అలాగే చిన్నపిల్లల చేతుల మీద తరుచూ వచ్చే దద్దుర్లను చిటికెలో తగ్గించే గుణం ఈ విప్పపూల నూనెలో ఉంటుందని చెబుతున్నారు. ము ఖ్యంగా స్త్రీలకు సంబంధించి గర్భస్రావ సమస్యలు, హైడ్రోఫోబియా వంటి వాటికి కూడా విప్ప కషాయం చక్కని ఔషధంగా పనిచేస్తుందంటున్నారు. విప్పకాయలను నూరి లేపనంగా మర్దనా చేస్తే శరీరంపై ఉండే కురుపులు మానిపోతాయని, విప్ప బెరడును నములుతూ ఉంటే పంటి చిగుళ్ల పటుత్వం పెరుగుతుందని, పంటినొప్పులు పూర్తిగా తగ్గిపోతాయని, గుట్కా, జర్దా లాంటివి నమిలే వారికి ఇది ఎంతో మేలు చేస్తుందని వివరిస్తున్నారు. చెవిలో ఇన్ఫెక్షన్తో బాధపడేవారికి విప్పనూనె ఎంతగానో ఉపకరిస్తుందని చెబుతున్నారు.
శ్రీరాముడికి ప్రీతిపాత్రం
శ్రీసీతారామచంద్రస్వామికి విప్పపువ్వు ఎంతో ప్రీతిపాత్రమైనదని ప్రతీతి. ఇందుకు అనుగుణంగా శ్రీసీతారాముల ఆలయాల వద్ద విప్పవువ్వు ప్రసాదాన్ని శ్రీరాముడి పూజకు ఉపయోగిస్తారు. ముఖ్యంగా భద్రాచలం ఆలయ ప్రాంగణంలోని ప్రతి దుకాణంలోనూ విప్పపువ్వు ప్రసాదం లభిస్తుంది. భక్తులు దీనిని కొనుగోలు చేసి శ్రీరాముడి పూజలో నైవేద్యంగా వినియోగిస్తారు.
జీసీసీ కేంద్రాల ద్వారా కొనుగోలు
గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులను జీసీసీ కేంద్రాలు ప్రభుత్వం ప్రకటించిన ధరకు కొనుగోలు చేస్తుంటాయి. కరకగూడెం మండలంలోని గిరిజనులు తాము సేకరించిన విప్పపూలను ఎండబెడతారు. నిర్ణీత సమయానికి ఎండిన తరువాత జీసీసీ డీలర్లు వీటిని కొనుగోలు చేస్తారు. ఆదివాసీలకు మంచి ధరను అందిస్తారు. ఈ ఏడాది కూడా విప్పుపూల సేరకణ రికార్డు స్థాయిలో జరుగుతుందని, మంచి ధర లభిస్తుందని జీసీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.
విప్పపూల సేకరణతో ఇంటిల్లిపాదికీ ఉపాధి
ప్రకృతిలో లభించే విప్పుపూల సేకరణతో రెండు నెలలపాటు మా ఇంటిల్లిపాదికీ ఉపాధి లభిస్తుంది. మా ఇంట్లోని కుటుంబ సభ్యులమంతా రోజూ ఉదయాన్నే లేచి విప్పపూల సేకరణకు వెళ్తాం. పూలను నిండుగా సేకరించుకొని ఇంటికి తిరిగి వస్తాం. ఇంటి వద్ద 5, 6 రోజులపాటు ఎండబెడతాం. వాటిని తీసుకెళ్లి జీసీసీ కేంద్రాల్లో విక్రయిస్తాం. ఔషధ గుణాలున్న విప్పపూలకు మంచి ధర పలుకుతుంది. మాకు సంతృప్తికర ఆదాయం సమకూరుతుంది.
-కొమరం పుష్పలత, అల్లేరుగూడెం, కరకగూడెం మండలం
సీజన్లో అధిక ఆదాయం
విప్పపూల ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉండడంతో మార్కెట్లో వీటికి డిమాండ్ అధికంగా ఉంటుంది. దీంతో ఏటా సీజన్లో మేం విప్పపూలను అధికంగా సేకరిస్తాం. జీసీసీ కేంద్రాల్లో విక్రయించి అధిక ఆదాయం పొందుతాం. అయితే, సేకరించిన మొత్తం విప్పపూలన్నింటినీ మేము విక్రయించం. కొన్ని పూలను మేం మా ఇళ్లలో నిల్వ చేసుకుంటాం. వివాహాలు, ఇతర కార్యాల సమయాల్లో వీటితో సారా కాచి మా బంధువులకు పోస్తాం. విప్ప సారా ఆరోగ్యానికి మేలు చేస్తుందని మా పూర్వీకులు చెప్పారు.
-రఘుపతి, గొల్లగూడెం, కరకగూడెం మండలం